Iran Missile Strike: ఇరాన్ – అమెరికా మధ్య జరుగుతున్న ప్రస్తుత యుద్ధం.. హిందూ మహాసముద్రానికి విస్తరించడం సంచలనంగా మారింది. ఇరాన్ మొదటిసారిగా మధ్యప్రాచ్యానికి వెలుపల ఉన్న అమెరికా-బ్రిటన్ సైనిక స్థావరంపై దాడి చేసింది. డియెగో గార్సియా (Diego Garcia) లక్ష్యంగా క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ తన భూభాగం నుండి రెండు ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణులను (IRBMs) డియెగో గార్సియాపైకి లాంచ్ చేసినట్లు అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది.
అయితే ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల వల్ల డియెగో గార్సియా సైనిక స్థావరానికి ఎలాంటి నష్టం జరగలేదని వాల్ స్ట్రీట్ జర్నల్ స్పష్టం చేసింది. కొన్ని నివేదికల ప్రకారం.. ఒక క్షిపణి గాలిలోనే విఫలం కాగా, రెండో దానిని అమెరికా యుద్ధనౌక తన SM-3 ఇంటర్సెప్టర్ ద్వారా అడ్డుకుంది. ఫలితంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. మరోవైపు ఈ దాడికి సంబంధించి పెంటగాన్ నుంచి ఇప్పటివరకూ ఒక్క అధికారిక ప్రకటన వెలువడకపోవడం గమనార్హం.
అయితే ఇరాన్ తన క్షిపణుల పరిధి కేవలం 2,000 కిలోమీటర్లు మాత్రమేనని గతంలో ప్రకటించింది. కానీ ఇరాన్ నుండి సుమారు 4,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న డియెగో గార్సియాను లక్ష్యంగా చేసుకోవడంతో వారి క్షిపణి సామర్థ్యం ప్రపంచం ఊహించిన దానికంటే చాలా ఎక్కువని స్పష్టమైంది. దీన్ని బట్టి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను ఇది కచ్చితంగా ఇబ్బందుల్లోకి నెట్టవచ్చని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ దాడిపై కేంద్ర మాజీ మంత్రి మనీష్ తివారీ ఎక్స్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందూ మహాసముద్రంలోని లోతట్టు ప్రాంతమైన డిగో గార్సియా ద్వీపాన్ని ఇరాన్ టార్గెట్ చేసిందన్న వార్తలు నిజమైతే.. పశ్చిమ దేశాలకు ఇది గట్టి హెచ్చరికేనని పేర్కొన్నారు. యుద్ధాన్ని మరింత విస్తరింపేజేసేందుకు తాము ఏమాత్రం వెనుకాడబోమన్న సంకేతాన్ని ఇరాన్ ఈ దాడి ద్వారా ఇచ్చినట్లైందని పేర్కొన్నారు.
Also Read: Huzurabad Politics: పాడి కౌశిక్ రెడ్డికి ఝలక్.. తిరగబడ్డ అనుచరులు.. పార్టీ మారేందుకు సన్నద్ధం!
అమెరికా బాంబర్లు తమ స్థావరాల నుండి ఇరాన్పై దాడులు చేయడానికి బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ అనుమతి ఇచ్చిన కొద్ది గంటల్లోనే ఇరాన్ ఈ ప్రతీకార చర్యకు పాల్పడింది. డియెగో గార్సియా అనేది హిందూ మహాసముద్రంలో అమెరికాకు ఉన్న అత్యంత కీలకమైన, సురక్షితమైన సైనిక స్థావరం. ఇక్కడి నుండే అమెరికా తన సుదూర లక్ష్యాలపై దాడులు చేసే బాంబర్లను నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలోనే దానిని దెబ్బకొట్టేందుకు ఇరాన్ ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడికి ముందే బ్రిటన్ ను ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ హెచ్చరించారు. బ్రిటన్ చర్యలు తమపై దురాక్రమణకు సమానమని పేర్కొన్నారు. దీనికి తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
Also Read: Telangana Budget: బడ్జెట్ అంతా ఓకే గానీ.. పాపం మూడు కార్పొరేషన్ల పరిస్థితే.. అగమ్య గోచరం!