TGPSC Jobs: స్వేచ్ఛ బ్యూరో: గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిందని సర్కార్ విమర్శించింది. టీజీపీఎస్సీ ద్వారా నిర్వహించే అత్యున్నతమైన గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించలేక, పరీక్షాపత్రాలు లీక్ కు కారణమైందని పేర్కొంది. దీంతో రాజ్యాంగబద్ధ సంస్థ టీజీపీఎస్సీ నవ్వులపాలైందని, గత ప్రభుత్వ నిర్లక్ష్యానికిఎందరో నిరుద్యోగులు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే యూపీఎస్సీ స్థాయిలో టీజీపీఎస్సీని పునర్ వ్యవస్థీకరించడంతో పాటు నిరుద్యోగుల ఆకాంక్షలను గుర్తించి ఇప్పటివరకు 67,763 మంది నిరుద్యోగులకు నియామక పత్రాలు అందించినట్లు స్పష్టంచేసింది.
Also read: Sports Budget: తెలంగాణ రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధికి 9 కీలక ఓప్పందాలు
అంతేకాకుండా రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచేందుకు వీలుగా రాష్ట్రంలో సివిల్స్ సాధించే లక్ష్యంతో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు అండగా నిలిచేందుకు రాజీవ్ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా ఈ సంవత్సరం ప్రభుత్వరంగ సంస్థ అయిన సింగరేణి సంస్థ సీఎస్ఆర్ నిధుల ద్వారా సివిల్స్ మెయిన్ పరీక్షలకు హాజరైన 202 మంది అభ్యర్థులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించింది. ఈ సహాయం అందుకున్న అభ్యర్థుల్లో 51 మంది ఇంటర్వ్యూలకు సైతం సెలెక్ట్ అయ్యారు. వారికి అదనంగా రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని సర్కార్ అందించింది. వారిలో 20 మంది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించి తెలంగాణ సత్తాను చాటి చెప్పారని ప్రభుత్వం స్పష్టంచేసింది.
Also read: New Schemes: తెలంగాణలో ఈ ఆర్థిక సంవత్సరం నుంచి.. మరో 9 నూతన పథకాలు