Israel-Iran War Highlights: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇలాంటి వేళ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని లేపేసేందుకు ఇజ్రాయెల్ ప్లాన్ చేస్తోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇరు దేశాల మధ్య జరుగుతున్న దాడులు, ప్రతిదాడుల్లోనే ఖమేనీని చంపేసేందుకు టెల్ అవీవ్ ప్రయత్నాలు చేస్తోందన్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే.. ప్రపంచ పెద్దన్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ ఆరోపణలు కొట్టిపారేస్తున్నారు.
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని లేపేసేందుకు..
ఇప్పటికే ఓవైపు ఇజ్రాయెల్ తమపై చేస్తున్న అటాక్స్ను ఆపేస్తే తాము సైతం ప్రతిదాడులు నిలిపివేస్తామని ప్రకటించింది ఇరాన్. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం భారత్-పాకిస్తాన్ మాదిరిగా రెండు దేశాలు యుద్ధాన్ని ఆపివేయాలని సూచించారు. అయినా సరే.. ఇరు దేశాల మధ్య బాంబు దాడులు, మిస్సైల్ అటాక్స్ కొనసాగుతున్నాయి.
పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలన్న నెతన్యాహు
టెల్ అవీవ్ సమీపంలోని బాట్ యామ్పై టెహరాన్ జరిపిన తాజా దాడుల్లో ఏడుగురు ఇజ్రాయెల్ పౌరులు మృతిచెందగా.. వందల సంఖ్యలో గాయపడ్డారు. ఇరాన్ క్షిపణి దాడితో ఆ ప్రాంతం చాలా వరకు ధ్వంసమైంది. దీనిపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. తమ దేశంపై దాడులు చేసేందుకు ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉంటే ఏం జరుగుతుందో ప్రపంచ దేశాలు ఆలోచించాలని అన్నారు. ఇంకా చెప్పాలంటే.. ఇరాన్ వద్ద 20 వేల క్షిపణులు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించాలని సూచించారాయన. తమ అస్తిత్వానికి ముప్పు కలిగే ప్రమాదం ఉందని భావించడం వల్లే తాము యుద్ధాన్ని ప్రారంభించామన్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.
ఇజ్రాయెల్ దాడుల్లో 80 మందికి పైగా..
శనివారం ఒక్కరోజే వందలాదిగా మిస్సైళ్లు ఇజ్రాయెల్ నుంచి దూసుకువచ్చి ఇరాన్లో కనీవిని ఎరుగని విధ్వంసం సృష్టించాయి. సుమారు 80 మందికి పైగా ఈ దాడుల్లో చనిపోయారు. అంతేకాదు.. ప్రపంచంలోనే పెద్దదైన గ్యాస్ కేంద్రం ది సౌత్ పార్స్పై బాంబుల వర్షం కురిపించి నేల మట్టం చేశాయి నెతన్యాహు సైన్యాలు.
ఇరాన్ పౌరులు మృతి
రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ తమపై మొదలు పెట్టిన సైనిక చర్యను.. ఇతర దేశాలకు విస్తరించాలని తాము అనుకోవడం లేదంటూ.. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ ప్రకటించారు. కానీ, ఇజ్రాయెల్ మాత్రం మరిన్ని దేశాలకు యుద్ధాన్ని విస్తరించాలన్న లక్ష్యంతోనే దాడులు చేస్తోందని విమర్శించారు అబ్బాస్ అరాక్చీ.
అమెరికా సపోర్ట్తోనే ఇజ్రాయెల్..
ఇరాన్పై టెల్ అవీవ్ చేస్తున్న దాడుల వెనుక అమెరికా సపోర్ట్ ఉందని ఆరోపించారు అబ్బాస్ అరాక్చీ. అలా లేదని నిరూపించుకోవాలంటే ఇజ్రాయెల్ తీరును అమెరికా బహిరంగంగా తప్పుపట్టాలన్నారు. ఐక్యరాజ్య సమతి సైతం నెతన్యాుహు ప్రభుత్వానికే మద్దతుగా నిలుస్తోందన్నారు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ.
అమెరికాపై ఇరాన్ దాడి చేస్తే..
అంతకుముందు.. ఈ దాడులు ఇక్కడితో ఆగవని ఇజ్రాయెల్ అధికారికంగానే ప్రకటించింది. ఇరాన్.. మరోసారి తమపై దాడులు చేయాలని ఆలోచన చేస్తే తీవ్ర నష్టాన్ని చవి చూడాల్సి ఉంటుందన ప్రకటించింది. అంతేకాదు.. టెహరాన్లోని మిలటరీ బేస్లు, ఆయుధ తయారీ సంస్థల సమీపంలోని ప్రజలు తమ ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని సూచించింది. ఆ ప్రాంత ప్రజల మంచి కోసమే తమ ప్రకటన అని చెప్పుకొచ్చింది ఇజ్రాయెల్.
Also Read: కారు బాంబు పేలుళ్లు.. 14 మంది సైంటిస్టులు, 128 మంది పౌరులు మృతి
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధాన్ని ఆపుతా-ట్రంప్
మరోవైపు.. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ.. ఇరాన్పై చేస్తున్న దాడుల వల్ల ఆ దేశంలో పాలనా మార్పు జరగొచ్చన్నారు. దాడులు ప్రారంభించడానికి ముందే ట్రంప్కి చెప్పినట్లు నెతన్యాహూ ధ్రువీకరించారు. తాజాగా, ట్రంప్ మాట్లాడుతూ.. ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య శాంతి నెలకొనాలని ఆశిస్తున్నానన్నారు. శాంతి చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు.