Gurpatwant Singh Pannun : ఖలిస్తానీ తీవ్రవాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ మరోసారి బెదిరింపులకు తెగబడ్డాడు. మార్చి 12 నుంచి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లను లక్ష్యంగా చేసుకుని భారతదేశంలో ఆర్థికంగా విధ్వంసానికి పాల్పడతామని వార్నింగ్ ఇచ్చాడు. మార్చి 12 లోపు భారతీయ స్టాక్లను డంప్ చేసి, అమెరికన్ స్టాక్లను కొనుగోలు చేయాలని తీవ్రవాది పన్నూన్ పిలుపునిచ్చాడు. దీనికోసం, అంతర్జాతీయంగా వ్యాపారం చేసే బ్యాంకులు, కార్పొరేట్లను కూడా పన్నూన్ గుర్తించినట్లు సమాచారం.
ఈ తాజా హెచ్చరికలు.. మార్చి 12 ముంబై వరుస పేలుళ్ల 31వ వార్షికోత్సవం నేపథ్యంలో రావడం ఆందోళనకు గురిచేస్తోంది. ఆ దాడుల్లో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ కూడా లక్ష్యంగా ఉంది. పన్నూన్ ఈ కొత్త ప్రచారం ద్వారా డబ్బు సంపాదించాలని ఆశిస్తున్నట్లు భారతీయ ఇంటెలిజెన్స్ నివేదికలు వెల్లడిస్తున్నాయి.
వాక్ స్వాతంత్య్రం పేరుతో విదేశీ ఏజెన్సీల కోసం పన్నూన్ ఏజెంట్గా పని చేస్తున్నాడు. గతంలో పన్నూన్ భారత ప్రధానిని కూడా బెదిరించాడు. డిసెంబరు 30న ప్రధాని అయోధ్య రోడ్షోను ఆపాలని ముస్లింలను ప్రేరేపించాడు. దానికి లక్ష డాలర్లు బహుమతిని కూడా ఆఫర్ చేశాడు.
ఇక ఇప్పుడు భారతదేశ ఆర్థిక స్థిరత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నట్లు ప్రకటించాడు. పన్నూన్ను గ్లోబల్ టెర్రరిస్ట్గా గుర్తించిన ఇండియన్ ఇంటెలిజెన్స్, అతడు విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందని ఇప్పటికే స్పష్టం చేసింది.
ఇక, భారత్ను లక్ష్యంగా చేసుకొని పన్నూన్ బెదిరింపులు కొత్తేమీ కాదు. నవంబర్ 19న, ICC ప్రపంచ కప్ ఫైనల్ను ‘జరగనీయమని’ బెదిరించాడు. అలాగే, డిసెంబర్ 13న గానీ, అంతకు ముందు గానీ… భారత పార్లమెంటుపై దాడి చేస్తానని చెప్పాడు. అలాగే, ఎయిర్ ఇండియాలో ప్రయాణించవద్దంటూ ప్రపంచ సిక్కు సమాజాన్ని హెచ్చరించాడు.
అమెరికా గడ్డపై ఖలిస్తానీ నాయకుడు పన్నూన్ను చంపడానికి కుట్ర జరిగినట్లు US అధికారులు ఇటీవల ప్రకటించారు. దీనికి సంబంధించి గతేడాది నవంబర్ నెలలో US ఫెడరల్ ప్రాసిక్యూటర్లు భారతీయ జాతీయుడు నిఖిల్ గుప్తాపై కేసు నమోదు చేశారు. మరో భారతీయ ప్రభుత్వ ఉద్యోగితో కలిసి అమెరికా గడ్డపై పన్నూన్ను చంపడానికి కుట్ర పన్నారనీ, ఆ ప్రయత్నం విఫలం అయ్యిందని అభియోగాలు మోపారు. అయితే, ప్రస్తుతం ఈ కేసులో విచారణ కొనసాగుతోంది.