Meta Pay Trump | అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్తో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ల మాతృ సంస్థ అయిన మెటా (Meta) తన సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఆయనకు 25 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.216 కోట్లు) నష్టపరిహారం చెల్లించనుంది. 2021లో క్యాపిటల్ భవనంపై దాడి జరిగిన సమయంలో ట్రంప్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై మెటా నిషేధం విధించింది. ఆ సమయంలో ట్రంప్ మెటా సంస్థపై కోర్టులో దావా వేశారు. ఈ కేసులో తాజాగా మెటా సంస్థ 25 మిలియన్ డాలర్ల సెటిల్మెంట్తో ఈ కేసును పరిష్కరించుకోవడానికి అంగీకరించింది. ఈ వివరాలు అనేక వార్తా పత్రికల ద్వారా బయటపడ్డాయి.
2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయారు. దీంతో 2021 జనవరి 6న క్యాపిటల్ హిల్ భవనంపై ఆయన అనుచరులు దాడి చేశారు. ఈ సంఘటన తరువాత ట్రంప్నకు చెందిన ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై నిషేధం విధించారు. తర్వాత 2023లో ఈ ఖాతాలను పునరుద్ధరించారు. అయితే, ఈ నిషేధానికి సంబంధించి ట్రంప్ మెటాపై దావా వేశారు. ఇప్పుడు మెటా ఈ కేసును సెటిల్ చేసుకోవడానికి సిద్ధమైంది. ఈ సెటిల్మెంట్లో భాగంగా 25 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు అంగీకరించింది. ఈ మొత్తంలో 22 మిలియన్ డాలర్లు ప్రెసిడెన్షియల్ లైబ్రరీకి, మిగిలిన మొత్తం కేసు ఖర్చులకు ఉపయోగించబడుతుంది.
Also Read: అమెరికా మిలిటరీలో ట్రాన్స్జెండర్లపై నిషేధం.. ట్రంప్ తాజా ఆదేశాలు
క్యాపిటల్ హిల్ దాడి: ట్రంప్ క్షమాభిక్ష
2021 జనవరి 6న క్యాపిటల్ హిల్పై దాడి చేసిన వారందరిపై ఇంతకుముందు బైడెన్ ప్రభుత్వం కేసుల పెట్టింది. ఇప్పుడు తాజాగా ట్రంప్ తిరిగి అధ్యక్షుడు కావడంతో ముందుగా క్యాపిటల్ హిల్ దాడి కేసులో నిందితులుగా ఉన్న తన 1600 మంది మద్దతుదారులకు క్షమాభిక్ష కల్పించే ఆదేశాలు జారీ చేశారు. రెండోసారి అధ్యక్ష పదవిని చేపట్టిన తొలి రోజుల్లోనే ఆయన ఈ ఆదేశాలను జారీ చేశారు. జనవరి 6 క్యాపిటర్ హిల్ దాడి ఘటనలో నమోదైన 450 క్రిమినల్ కేసులను డిస్మిస్ చేయాలని అటార్నీ జనరల్ను ప్రెసిడెంట్ ట్రంప్ ఆదేశించారు.
క్యాపిటల్ హిల్ దాడి అమెరికా చరిత్రలోనే హింసాత్మక ఘటనగా నమోదైంది. 2020 ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయిన తర్వాత, ఆయన అభిమానులు క్యాపిటల్ హిల్పై దాడి చేశారు. ఈ సంఘటనలో వందల సంఖ్యలో పోలీసులు గాయపడ్డారు. అధికార మార్పిడి సమయంలో ఈ హింస జరిగింది. ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు అమెరికా న్యాయశాఖ తీవ్ర కసరత్తులు చేసింది.
ఇప్పుడు ట్రంప్ ఆ ఘటనలో పాల్గొన్న వారికి క్షమాభిక్ష కల్పించడం, అమెరికా పోలీసు శాఖకు మింగుడుపడటం లేదు. మరోవైపు 2020లో ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత క్యాపిటల్ హిల్, ఇతర అభియోగాలలో ట్రంప్పై కేసులు పెట్టిన అధికారులందరినీ ఆయన రెండోసారి అధ్యక్షుడయ్యాక పదవుల నుంచి సస్పెండ్ చేశారు. ప్రస్తుతం వారి ఉద్యోగాలు ఊడిపోయినట్లేనని అమెరికా మీడియా నివేదించింది.
హష్ మనీ కేసు: ట్రంప్ అప్పీల్కు సిద్ధం
హష్ మనీ కేసులో న్యూయార్క్ జడ్జి ట్రంప్కు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై తాను అప్పీల్కు వెళ్తానని ట్రంప్ ఇదివరకే పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన తన కేసును వాదించేందుకు కొత్త లాయర్లను నియమించుకున్నారు. ‘అధ్యక్షుడు ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని క్రిమినల్ చట్టాన్ని దుర్వినియోగం చేశారు. ఇది ప్రమాదకరమైనది. న్యూయార్క్ జడ్జి తీర్పుపై మేము అప్పీల్కు వెళ్తాం. కేసు కొట్టివేసే వరకు పోరాడతాం’ అని ట్రంప్ కొత్త న్యాయవాది రిబర్ట్ గియుఫ్రా పేర్కొన్నారు.