Trump Govt: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమిగ్రేషన్ విధానాలతో వలసదారుల్ని వణికిస్తున్నారు. అమెరికాలోకి ఇతర దేశాల ప్రజలు రాకుండా అడ్డుకట్ట వేసేందుకు చకచకా నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా వీసా అపాయింట్మెంట్లను అర్ధంతరంగా నిలిపి వేసింది ట్రంప్ సర్కార్. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది?
అమెరికా ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వలసదారులను కట్టడి చేసేందుకు అనేక చట్టాలను తీసుకొచ్చారు. అంతేకాదు కొత్త మార్గాలను ఇంకా అన్వేషిస్తున్నారు. అమెరికాలో స్థిరపడాలనుకునే వీసా దరఖాస్తుదారులకు షాకిచ్చింది ట్రంప్ సర్కార్. ప్రపంచవ్యాప్తంగా అమెరికా కాన్సులేట్లలో వీసా దరఖాస్తుల అపాయింట్మెంట్లను తాత్కాలికంగా రద్దు చేసింది.
తమ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో శిక్షణా కార్యక్రమం మొదలైందని, అందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంటర్వ్యూ షెడ్యూలు దరఖాస్తుదారులకు మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. రీ షెడ్యూలింగ్ గురించి త్వరలో తెలియజేస్తామని పేర్కొంది.
రాయబార కార్యాలయాల్లో శిక్షణ కార్యక్రమం దేనికి? ఎంతకాలం కొనసాగుతుంది? అనేదానిపై విదేశాంగ శాఖ ఎలాంటి వివరాలు బయటపెట్టలేదు. యూఎస్ ప్రభుత్వ పథకాలపై ఆధారపడిన దరఖాస్తుదారులను కాన్సులేట్ అధికారులు వడపోసి తొలగించేందుకు శిక్షణా కార్యక్రమం ఉంటుందని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి.
ప్రస్తుతం శిక్షణ నిలిపివేత ఎంతకాలం కొనసాగుతుందో వాషింగ్టన్ స్పష్టం చేయలేదు. స్పష్టమైన కాలపరిమితి లేకపోవడం వల్ల ఇంటర్వ్యూ తేదీలను ఖరారు చేసుకున్న దరఖాస్తుదారులలో అనిశ్చితి నెలకొంది. యూఎస్ ఇమ్మిగ్రేషన్ చట్టంలో పబ్లిక్ ఛార్జ్ అని పిలవబడే మదింపు అనేది ఒక భాగం.
వీసా దరఖాస్తుదారుడు పబ్లిక్ ఛార్జ్గా మారే అవకాశం ఉందో లేదో నిర్ధారించేటప్పుడు కాన్సులర్ అధికారులు వారి ఆర్థిక పరిస్థితులు, కుటుంబ స్థితి, విద్య-నైపుణ్యాలతో సహా పలు అంశాలను పరిగణనలోకి తీసుకోవచ్చని స్టేట్ డిపార్ట్మెంట్ చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా విరామం ఇవ్వడం వల్ల ఉపాధి ఆధారిత వలస వీసా కార్యక్రమాల ద్వారా అమెరికాకు వెళ్లేవారిని ప్రభావితం చేయవచ్చు.
ఈ అంతరాయం అంతర్జాతీయంగా బదిలీలు చేసే కంపెనీల కార్మికులపై ప్రభావితం చూపే అవకాశం ఉంది. వీసా ప్రాసెసింగ్లో జాప్యం కారణంగా దరఖాస్తుదారులు కొత్త అపాయింట్మెంట్ల కోసం చిక్కుకుపోవచ్చు. చట్టబద్ధమైన వలసలపై ట్రంప్ ప్రభుత్వం తన పరిధిని విస్తరిస్తున్న తరుణంలో తాజా చర్య తీసుకున్నారు.
ALSO READ: ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 15 మంది శిశువులు మృతి, ఇస్లామాబాద్ ఆసుపత్రిలో ఘోరం
ఇప్పటికే పబ్లిక్ ఛార్జ్ మదింపు వంటి అంశాలపై చర్యలను విదేశాంగ శాఖ ప్రవేశపెట్టింది. 75 దేశాల పౌరులకు వలస వీసాల జారీని నిలిపివేయాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని అక్కడి న్యాయస్థానం కొట్టివేసిన కొద్ది కాలానికే, వీసా ఇంటర్వ్యూలపై తాత్కాలిక నిలుపుదల చేపట్టింది.