Russia Drone Attack : రష్యా – ఉక్రెయిన్ యుద్ధం మొదలై ఫిబ్రవరి 24కి సరిగ్గా మూడేళ్లు పూర్తవుతుంది. ఈ తరుణంలోనే ఇప్పటి వరకు యుద్ధంలో ఎన్నడూ లేని విధంగా.. ఉక్రెయిన్ పైకి రష్యా డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద సింగిల్ డ్రోన్ల దాడిగా రక్షణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఉక్రెయిన్ అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. ఖార్కివ్, పోల్టావా, సుమీ, కైవ్, చెర్నిహివ్, మైకోలైవ్, ఒడెసాతో సహా ఉక్రెయిన్ అంతటా దాదాపు 13 ప్రాంతాలలో రష్యా డ్రోన్లు దాడులు చేశాయి. ఒకే సమయంలో ఈ దాడిని నిర్వహించగా.. ఇందులో రికార్డు స్థాయిలో 267 రష్యన్ డ్రోన్లు పాల్పొన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ వైమానిక దళ కమాండ్ ప్రతినిధి యూరి ఇగ్నాట్ ఇంటర్నేషనల్ మీడియాకు వెల్లడించారు.
ఇప్పటి వరకు అనేక ఆయుధాలు, క్షిపణులతో దాడులు చేసుకుంటున్న ఇరు వర్గాలు.. డ్రోన్లతోనూ అనేక ప్రాంతాలపై దాడులకు పాల్పడుతున్నాయి. కానీ.. ఈ స్థాయిలో ఒకేసారి ఇన్ని డ్రోన్లను వినియోగించిన రికార్డు లేదు. కాగా.. రష్యా నుంచి దండెత్తిన డ్రోన్లల్లో 138 డ్రోన్లను కూల్చివేయగా, మరో 119 డ్రోన్లను ఎటువంటి నష్టం కలిగించకుండా జామ్ చేసినట్లుగా అధికారులు వెల్లడించారు. అయితే.. మిగతా డ్రోన్ల కారణంగా కీవ్ సహా అనేక ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డాయని తెలుస్తోంది. ఇదే సందర్భంలో యుద్ధం ప్రారంభించి మూడేళ్లు అవుతున్న తరుణంలో.. రష్యా మూడు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని, వీటి కారణంగా ఉక్రెయిన్లోని ఐదు ప్రాంతాల్లో నష్టం సంభవించినట్లుగా చెబుతున్నారు. ఈ దాడుల్లో మృతులు, ఆస్తి నష్టం వంటి వివరాల్ని ఏ దేశ అధికారులు వెల్లడించనప్పటికీ.. రష్యా ప్రయోగించిన ఓ క్షిపణి దాడిలో సెంట్రల్ టౌన్ క్రివీ రిగ్లో ఒకరు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారని ప్రాంతీయ మీడియా నివేదించింది.
మాస్కో కొన్ని నెలలుగా ఉక్రెయిన్పై రాత్రి వేళ సామూహిక డ్రోన్ దాడులు చేస్తోంది. దీంతో.. వైమానిక సౌకర్యాలపై దాడులు నిర్వహిస్తోంది. దీంతో.. రష్యాలోని సైనిక స్థావరాలు, పారిశ్రామిక ప్రదేశాలను టార్గెట్ గా చేసుకుని రష్యాపై ఉక్రెయిన్ దాడులు నిర్వహిస్తోంది. ఈ ఘటనపై స్పందించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ.. రష్యా రాత్రిపూట 200 కంటే ఎక్కువ డ్రోన్లను ప్రయోగించిందని, ఇది యుద్ధంలో అతిపెద్ద దాడి అని అన్నారు. రష్యా దాడుల్ని ఖండించిన ఆయన.. ఉక్రెయిన్ మిత్రదేశాల మధ్య ఐక్యత కోసం పిలుపునిచ్చారు. తమకు మొత్తం యూరప్ బలం, అమెరికా బలం, శాశ్వత శాంతిని కోరుకునే ప్రతి ఒక్కరి బలం అవసరమని వ్యాఖ్యానించారు.
Also Read : China’s deepest well : చైనా తవ్విన ఈ బావి లోతు 11 కి.మీ – ఎందుకు తవ్వారో తెలుసా?
గత వారంలో రష్యా ఉక్రెయిన్పై దాదాపు 1,150 అటాక్ డ్రోన్లు, 1,400 కంటే ఎక్కువ గైడెడ్ ఏరియల్ బాంబులు, 35 క్షిపణులను ప్రయోగించిందని.. జెలెన్స్కీ ఆరోపించారు. రష్యా రక్షణశాఖ సైతం తమ దేశంలోకి కీవ్ సేనలు 20 డ్రోన్లను ప్రయోగించిందని, వాటిని నాశనం చేసినట్లు తెలిపింది. కాగా.. ఇన్నాళ్లు ఉక్రెయిన్ కు పెద్దన్నలా అండగా నిలిచిన అమెరికా తన పాత్ర నుంచి క్రమంగా వెనక్కి తగ్గుతుండడం, రష్యాపై యుద్ధాన్ని ముగించాలని ఉక్రెయిన అధ్యక్షుడిపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా ఉక్రెయిన తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉక్రెయిన్ కు ఆయుధాలు, నిధుల్ని అందించాలంటే.. తమకు ఉక్రెయిన్లోని విలువైన ఖనిజాలు, గనుల్ని కేటాయించాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రతిపాదిస్తున్నారు. లేదంటే.. ఒంటరిగా యుద్ధానికి వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలో ఇలాంటి భారీ దాడి జరగడంతో.. క్రమంగా ఉక్రెయిన్ సేనలు ఒత్తిడిలో వెళ్లే ప్రమాదముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.