America: సినిమాలు, సీరియల్ ప్రభావమా? మరేదైనా కావచ్చు. హత్యలు చేసి తప్పించుకోవడానికి రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు కొందరు నిందితులు. తాజాగా అమెరికాలోని ఇంట్లో భార్యను చంపాడు ఓ టెక్కీ. ఆ తర్వాత బాత్రూం తనదైన శైలిలో డ్రామాలు ఆడాడు. చివరకు అతగాడ్ని పోలీసులు అరెస్టు చేశారు. అసలేం ఏం జరిగింది?
అమెరికాలో మృతి చెందిన రాజిత సబ్బినేని కేసు: అమెరికా వాషింగ్టన్ సమీపంలోని సియాటెల్ సమీపంలో దారుణం జరిగింది. గతేడాది అక్టోబరులో 27 ఏళ్ల భారతీయ మహిళ రాజిత సబ్బినేని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ కేసు దర్యాప్తులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో మహిళ రాజిత సబ్బినేని భర్త అసలు నిందితుడిగా నిర్ధారించారు.
ప్లాన్ ప్రకారం స్కెచ్ వేసిన ఆమె భర్త అవినాశ్ నార్నే: రాజిత భర్త అవినాశ్ నార్నే. ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు అవినాశ్. ఇంట్లోని బెడ్ రూమ్లో భార్యను గొంతు నులిమి హత్య చేసినట్లు కింగ్ కౌంటీ ప్రాసిక్యూటర్ నిర్ధారించారు. జులై ఒకటిన అవినాశ్ నార్నేపై మర్డర్ అభియోగాలు మోపారు. అతడ్ని అరెస్ట్ చేసి కింగ్ కౌంటీ జైలుకు తరలించారు. ప్రస్తుతం నిందితుడు కస్టడీలో ఉన్నాడు.
మరో మహిళతో రిలేషన్ షిప్, హత్య చేసిన రోజు కూడా: అక్టోబర్ 27న రాత్రి అవినాశ్ పోలీసులకు ఫోన్ చేసి తన భార్య బాత్రూంలో బంధించారని, బయటకు రాలేదని ఫిర్యాదు చేశాడు. నార్త్ ఈస్ట్ 10వ వీధిలోని 13700 బ్లాక్లోవున్న అపార్ట్మెంట్కు అధికారులు చేరుకున్నారు. బాత్రూం తలుపులు పగలగొట్టి లోపల చూడగా రాజిత సబ్బినేని నేలపై విగతజీవిగా పడివుంది. ఆమె అక్కడికక్కడే మరణించింది.
ఆమెని హత్య చేసినట్టు నిర్ధారించింది. గొంతు నులమడం వల్ల ఊపిరాడక రాజిత మరణించినట్లు వైద్యులు నివేదిక ఇచ్చారు. గతేడాది తాము 2025 జూన్ 5న వివాహం చేసుకున్నట్లు అవినాశ్ పోలీసులకు చెప్పాడు. తాను బయటకు వెళ్లి వచ్చేసరికి భార్య బాత్రూమ్లో ఉందని నమ్మించే ప్రయత్నం చేశాడు.
టెక్కీ నార్నే అవినాశ్ను అరెస్టు చేసిన పోలీసులు: దర్యాప్తులో భర్త డిజిటల్ ఆధారాలను పరిశీలించడంతో అసలు విషయాలు బయటపడ్డాయి. అపార్ట్మెంట్ స్మార్ట్ లాక్ డేటాను తనిఖీ చేశారు. అవినాశ్ బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లోకి ఎవరూ ఆ సమయంలో ప్రవేశించలేదని తేలింది. రాజితతో వివాహానికి ముందు నార్నేకు స్వదేశంలో మరో మహిళతో రహస్య సంబంధం ఉందని అధికారులు తెలిపారు. వారి వివాహానికి ఆ మహిళ కూడా హాజరైనట్లు బయటపడింది.
ALSO READ: ఇరాన్-అమెరికా మధ్య మళ్లీ యుద్ధం.. చమురు లైసెన్సులు రద్దు, ఆయిల్ ధరలకు రెక్కలు
వివాహం తర్వాత నార్నే.. ఆమెతో పలుమార్లు ఫోన్లో మాట్లాడినట్టు సమాచారం. రాజిత మరణించిన రోజు అవినాశ్ సదరు మహిళకు నాలుగు సార్లు ఫోన్ చేశాడు. మరుసటి రోజు భార్య మృతదేహం ఫోటోను ఆమెకు పంపినట్లు తేల్చారు. మృతికి ముందు రాజితకు భర్త ఇచ్చిన డ్రింక్ చేదుగా మందుల వాసన వచ్చిందంటూ పంపిన మెసేజ్లను సేకరించారు. దాదాపు 8 నెలల దర్యాప్తు తర్వాత పక్కా సాక్ష్యాలతో అవినాశ్ను అరెస్ట్ చేశారు పోలీసులు.