ప్రపంచ వ్యాప్తంగా ఇటీవల ప్రముఖంగా వార్తల్లో వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు డొనాల్డ్ ట్రంప్. అమెరికాకు దిగుమతి చేసుకునే వస్తువులపై భారీ సుంకాలు విధిస్తూ.. వివిధ దేశాలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ట్రంప్, తాజాగా మరోసారి సుంకాల అమలు ఉత్తర్వులపై సంతకాలు చేశారు. భారత్ పై విధిస్తున్న సుంకాలను గతంలో ప్రకటించినట్టుగానే 25 శాతానికి పెంచారు. అదే సమయంలో పాకిస్తాన్ పై ఆయన అతి ప్రేమ కురిచింపారు. పాక్ వస్తువులు అమెరికాకు ఎగుమతి అయితే గతంలో 29 శాతం పన్నులు వసూలు చేస్తుండగా, ఇప్పుడు దాన్ని 19 శాతం చేశారు. అంటే ఏకంగా 10 శాతం తగ్గించారనమాట. పాక్ అంటే ఆయన వల్లమాలిన ప్రేమ చూపిస్తుండటం సంచలనంగా మారింది.
గరిష్టం-కనిష్టం..
ఆగస్ట్ -7 నుంచి కొత్త సుంకాలు అమలులోకి వస్తాయని ప్రకటించారు ట్రంప్. చాలా దేశాలపై భారీగా వడ్డించారు. సిరియాపై 41 శాతం టారిఫ్ విధించారు. కెనడా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై గతంలో 25 శాతం సుంకం వసూలు చేస్తుండగా ఇప్పుడది 35 శాతానికి పెరిగింది. బ్రెజిల్ పై వీరబాదుడు బాదారు ట్రంప్. ఏకంగా 50శాతం సుంకాలు వసూలు చేసేందుకు నిర్ణయించారు. గతంలో ఇది 10 శాతం మాత్రమే. పాకిస్తాన్ సుంకాలను 29 శాతం నుంచి 19 శాతానికి తగ్గించి మేలు చేశారు. గతంలో 50 శాతం టారిఫ్ ఉంటుందని ఆఫ్రికాలోని లెసో అనే దేశాన్ని బెదిరించిన ట్రంప్, ఇప్పుడు దాన్ని 15 శాతానికి తగ్గించడం విశేషం.
ఎలా అమలు చేస్తారు?
ఒక్కో దేశంపై ఒక్కో రకం సుంకం విధించారు ట్రంప్. ఇలా ప్రతి దేశానికి విభిన్నమైన సుంకం ఉండటంతో అమలు చేయడం అధికారులకు కత్తిమీద సాము అని అంటున్నారు. అంతే కాదు, ఈ సుంకాలను అలవాటు చేసుకోవడం, డిమాండ్ కి తగ్గట్టుగా వస్తువులను సప్లై చేయడం ఎగుమతి చేసే దేశాలకు కూడా కష్టమే. అటు అమెరికాలో విదేశీ వస్తువుల్ని దిగుమతి చేసుకునే కంపెనీలు కూడా ఒడిదొడుకులకు లోనయ్యే అవకాశం ఉంది.
పాక్ సంగతేంటి?
ఇతర దేశాల సంగతి సరే, పాకిస్తాన్ తో మరీ అంత అంటకాగడం ట్రంప్ కి మంచిది కాదని అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. పాకిస్తాన్ దగ్గర వనరులు లేవు, అలాగని సాంకేతికత కూడా లేదు, పైగా ఉగ్రవాద దేశం అనే ముద్ర ఉంది. అలాంటి దేశంతో రాసుకు పూసుకు తిరగాలనుకోవడం ట్రంప్ అజ్ఞానం అంటున్నారు. కచ్చితంగా భవిష్యత్ లో దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు.
చమురు నిక్షేపాలున్నాయా?
పాకిస్తాన్ లో చమురు నిక్షేపాలున్నాయని, వాటిని వెలికి తీసేందుకు ఆ దేశానికి అమెరికా సాయం చేస్తుందని ఆ మధ్య ట్రంప్ ప్రకటించారు. ఏదో ఒక రోజు భారత్ కూడా పాక్ నుంచి చమురు దిగుమతి చేసుకుంటుందని కూడా జోస్యం చెప్పారు. ఇక్కడ ట్రంప్ కి తెలియదని ఏంటంటే.. ఆయన ఉన్నాయి అనుకుంటున్న ఆ నిక్షేపాలు బలూచిస్తాన్ పరిధిలోకి వస్తాయి. ఇక్కడే బలూచ్ కి మండింది. తమ ప్రమేయం లేకుండా తమ ప్రాంతంలోని వనరులపై అమెరికా-పాక్ ఒప్పందాలు కుదుర్చుకోవడమేంటని బలూచిస్తాన్ నేత మీర్ యార్ బలూచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బలూచిస్తాన్ అమ్మకానికి లేదంటూ ఆయన అన్నారు. తమ ప్రాంత ప్రజల అనుమతి లేకుండా అమెరికా అడుగు ముందుకు వేయడం సాధ్యం కాదన్నారాయన. ఒకవేళ అదే జరిగితే.. దాని ద్వారా వచ్చే ఆదాయం తీవ్రవాదులకు చేరుతుందని ఆందోళన వ్యక్తం చేసారు. గతంలో పాక్ తీవ్రవాదుల దెబ్బ ఎలా ఉంటుందో అమెరికా ఓసారి రుచి చూసింది. మరోసారి పాకిస్తాన్ కి పాలుపోసి పెంచితే, మరింత బలంగా అది కాటువేస్తుందని అంటున్నారు నెటిజన్లు.