Iran USA Talks: పాకిస్తాన్ వేదికగా సోమవారం మరోసారి ఇరాన్-అమెరికా చర్చలు జరగనున్నాయి. ఇప్పటికే తొలిదశ చర్చలు విఫలమవ్వడంతో.. ఈసారి చర్చలపై ఆసక్తి నెలకొంది. ఇరాన్తో చర్చలకు అమెరికా ప్రతినిధులు సోమవారం పాకిస్తాన్కు వెళ్తారని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఒకవేళ ఒప్పందం కుదరకపోతే, ఇరాన్ విద్యుత్ ప్లాంట్లను, వంతెనలను పూర్తిగా ధ్వంసం చేస్తామని మరోసారి హెచ్చరించారు. ఆదివారం ఒక సోషల్ మీడియా పోస్ట్లో, హర్మూజ్ జలసంధిలో శనివారం జరిగిన దాడులతో ఇరాన్.. రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ట్రంప్ మండిపడ్డారు.
“మేము చాలా సులభమైన ఒప్పందాన్ని ప్రతిపాదిస్తున్నాం, ఇరాన్ దానిని అంగీకరిస్తుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే, వాళ్లు అంగీకరించకపోతే, అమెరికా ఇరాన్లోని ప్రతి ఒక్క విద్యుత్ ప్లాంట్ను, ప్రతి ఒక్క వంతెనను ధ్వంసం చేస్తుంది.ఇకపై నేను మంచివాడిని కాను” అని ట్రంప్ సోషల్ మీడియాలో రాశారు.
“ఇరాన్ శనివారం హర్మూజ్ జలసంధిలో రెండు నౌకలపై కాల్పులు జరిపింది. ఇది కాల్పుల విరమణ ఒప్పందాన్ని పూర్తిగా ఉల్లంఘించడమే. ఇరాన్ ఫ్రెంచ్ నౌక, యునైటెడ్ కింగ్డమ్కు చెందిన ఒక సరుకు రవాణా నౌకను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపింది. అది మంచి పని కాదు. మా ప్రతినిధులు పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్కు వెళ్తున్నారు. వారు చర్చల కోసం రేపు సాయంత్రం అక్కడికి చేరుకుంటారు. . ఇరాన్ ఇటీవల ఆ హార్మూజ్ ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మార్గం మూసివేయడం వల్ల ఇరాన్ కు రోజుకు 500 మిలియన్ డాలర్లు నష్టపోతుంది” అని ట్రంప్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
Also Read: అమెరికాకు ఇరాన్ మరొక హెచ్చరిక.. ముప్పు వాటిల్లితే, ఏ పోర్టు సేఫ్గా ఉండదంటూ..
హార్మూజ్ దిగ్బంధనం వల్ల యూఎస్ కు ఏం నష్టం లేదని ట్రంప్ అన్నారు. ఇరాన్ ఐఆర్జీసీ సౌజన్యంతో అనేక నౌకలు సరుకులు నింపుకోవడానికి అమెరికాలోని టెక్సాస్, లూసియానా, అలాస్కాకు బయలుదేరాయని అన్నారు. అమెరికా చాలా న్యాయమైన, సహేతుకమైన ఒప్పందాన్ని ప్రతిపాదిస్తుందన్నారు. ఇరాన్ దానికి అంగీకరిస్తుందని ఆశిస్తున్నానన్నారు. ఈసారి చర్చలు విఫలమైతే ఇరాన్ హత్యా యంత్రాంగానికి ముగింపు పలికే సమయం వస్తుందని ఆయన అన్నారు.
యూఎస్ హార్మూజ్ దిగ్బంధనాన్ని కొనసాగిస్తుండడంతో.. పాకిస్తాన్కు ప్రతినిధి బృందాన్ని పంపాలా? వద్దా? అనే దానిపై ఇరాన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ తస్నిమ్ పేర్కొంది. ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనాన్ని కొనసాగిస్తామని అమెరికా చెప్పడంతో, ఇరాన్ అధికారులు హార్మూజ్ జలసంధిని తెరవాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. నౌకా రవాణాపై ఆంక్షలను తిరిగి విధించారు. ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఇరాన్ అధికారులు అంటున్నారు.