Indian Students Died in Scotland: స్కాట్లాండ్ లోని డూండీ యూనివర్సిటీలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు.. ట్రెక్కింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు నీటిలో పడి మరణించారు. మృతులు జితేంద్రనాథ్ (26), చాణక్య బోలిశెట్టి (22)గా గుర్తించారు. ఏప్రిల్ 17, బుధవారం.. పెర్త్ షైర్ లోని బ్లెయిర్ అథోల్ లో గల లిన్ ఆఫ్ తుమ్మెల్ వద్ద వాళ్లిద్దరూ కలిసి తీసుకున్న ఫొటో ఆధారంగా మృతులను గుర్తించారు. ఒక డేటా సైన్స్, మరొకరు ఇంజినీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీలు చదువుతున్నారు. గురువారం సాయంత్రం 7 గంటల సమయంలో.. ఇద్దరి మృతదేహాలను నీటిలో నుంచి వెలికి తీశారు.
డూండీ యూనివర్శిటీలో చదువుకున్న నలుగురు స్నేహితులు ట్రెక్కింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో పాటు అంబులెన్సులు సైతం ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. దురదృష్టవశాత్తు ఇద్దరూ మరణించడంతో.. ఆ కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇద్దరూ తెలుగు రాష్ట్రాలకు చెందినవారే. ఇద్దరి మృతదేహాలను నేడు పోస్టుమార్టం నిర్వహించి.. అనంతరం భారత్ కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read: ఇండియా పరువు తీసేశారు.. అమెరికాలో తెలుగు అమ్మాయిలు అరెస్ట్
కాగా.. జితూ గతంలో అమెరికాలోని కనెక్టికట్ లో ఉన్న హార్ట్ ఫోర్డ్ యూనివర్సిటీలోనూ చదువుకున్నాడు. ప్రస్తుతం డూండీ యూనివర్సిటీలో చదువుతూ.. టాజా ఇండియన్ బఫే రెస్టారెంట్ లో పనిచేస్తున్నాడు. అతను చాలా మంచివాడని.. అందరితో కలిసి మెలిసి ఉండేవాడని ఆ రెస్టారెంట్ నిర్వాహకులు తెలిపారు. అతని అకాల మరణంతో.. తమ సిబ్బంది అంతా షాక్ కు గురయ్యారని చెప్పారు. చాణక్య హైదరాబాద్ లోని జేఎన్టీయూహెచ్ నుంచి 2022లో ఇంజినీరింగ్ పట్టా పొందాడు. మృతిచెందిన ఇద్దరు విద్యార్థుల కుటుంబాలకు అండగా ఉంటామని డూండీ యూనివర్సిటీ స్పోక్స్ పర్సన్ తెలిపారు.