UAE To Iran: ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ముగిసే పరిస్థితులు కనిపించలేదు. ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం క్రమంగా పెరుగుతోంది. పరిస్థితి గమనించిన యూఏఈ తన వంతు ప్రయత్నాలు చేస్తోందా? ఈ క్రమంలో ఇరాన్కు భారీగా సాయం చేస్తోందా? ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో రకరకాల వార్తలు జోరందుకున్నాయి.
ఇరాన్-అమెరికా మధ్య చర్చలు, దౌత్య ప్రయత్నాలు నిలిచిపోయాయి. ఇప్పటికిప్పుడు ఆ దేశాల యుద్ధం ముగిసే సూచనలు ఏమాత్రం కనిపించలేదు. అంతలో కాల్పులు విరమణ చెబుతున్నాయి.. ఆ వెంటనే దాడులు చేసుకుంటున్నాయి. జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్-UAE, తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా ఇరాన్ను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ దేశం రెండు టన్నుల బంగారాన్ని ఇరాన్కు ఇచ్చిందని అంతర్జాతీయ మీడియా కథనాలు జోరందుకున్నాయి.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్-అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో జూన్ 24, 2026న యూఏఈలోని జుమా రెస్టారెంట్లో సమావేశమయ్యారు. టెహ్రాన్లోని పలు వర్గాల సమాచారం ప్రకారం.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తన బ్యాంకులలో స్తంభింపజేసిన అనేక బిలియన్ డాలర్ల ఇరాన్ ఆస్తులను విడుదల చేసిందని తెలుస్తోంది. అందులో సుమారు 283 మిలియన్ డాలర్ల విలువైన రెండు టన్నుల బంగారం ఉంది. అమెరికా-ఇరాన్ల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న తరుణంలో ఎలాంటి పురోగతి లేని నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. భవిష్యత్తులో ఇరాన్ చేపట్టే ఎలాంటి ప్రతీకార చర్యల నుంచి గల్ఫ్ దేశాన్ని దూరంగా ఉంచేలా టెహ్రాన్ను ఒప్పించడమే ఈ నిర్ణయం వెనుక లక్ష్యమని ఆ వర్గాలు చెబుతున్నాయి.
ఈ ప్రణాళికలో భాగంగా ఆగస్టు 11, 12న అబుధాబి-టెహ్రాన్ టెహ్రాన్లోని మెహ్రాబాద్ -కరాజ్లోని పయామ్ ఎయిర్పోర్టులకు పలుమార్లు విమానాలు ప్రయాణించాయి. ప్రతిసారీ గంటసేపు ఉండి, తిరిగి యూఏఈకి వచ్చినట్లు సమాచారం. విమానాల ద్వారా స్తంభింపజేసిన చేసిన ఇరాన్ నిధులను తరలించినట్లు రాసుకొచ్చాయి. జూన్ 8న అబుధాబి నుంచి ఇరాన్లోని మెహ్రాబాద్ ఎయిర్పోర్ట్కు ఓ విమానం వెళ్లింది. అప్పుడు మూడు బిలియన్ డాలర్లను ఇరాన్కు బదిలీ చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇరాన్కు బదిలీ చేసినట్లు సమాచారం ఉన్న ఆస్తుల్లో సుమారు 283 మిలియన్ డాలర్ల విలువైన రెండు టన్నుల బంగారం కూడా ఉంది. ఇరాన్ విమానయాన సంస్థలకు చెందిన 15 పాత ప్రయాణీకుల విమానాలు అమ్మకానికి యూఏఈ అనుమతి ఇచ్చినట్లు సమాచారం.
ALSO READ: ఇమ్రాన్ ఖాన్ చనిపోయారా? రచ్చలేపిన జర్నలిస్టు వీడియో, క్లారిటీ ఇచ్చిన పాక్ ఆర్మీ
భారీ ఎత్తున నగదు కూడా తీసుకెళ్లినట్టు సమాచారం. ఇవికాకుండా మరో 14 ప్యాసింజర్ విమానాలు, రెండు ఎయిర్ బస్లు ఇరాన్కు వెళ్లడానికి ముందు రొమేనియాలోని ఓ ఎయిర్పోర్ట్లో ఉన్నట్లు ఉపగ్రహ చిత్రాల్లో బయటపడింది. అమెరికా-ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 30 ప్యాసింజర్ విమానాలు ధ్వంసమయ్యాయని ఇరాన్ గతంలో వెల్లడించింది. యూఏఈ నుంచి వెళ్లే విమానాలు ఆ లోటు భర్తీ చేయనున్నట్లు ప్రస్తావించాయి. ఇరాన్-అమెరికాల మధ్య జరుగుతున్న ఘర్షణలో తమ ప్రమేయం లేకుండా ఉండేందుకు యూఏఈ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో నిధులు-బంగారం-విమానయాన బదిలీలు జరిగినట్లు వార్తలు గుప్పుమన్నాయి.