సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పదో తరగతి సెషన్-1 ఫలితాలను అధికారికంగా వెల్లడించింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ రిజల్ట్స్ కాసేపటి క్రితమే విడుదల అయ్యాయి. విద్యార్థులు తమ మొబైల్ ఫోన్లలోని UMANG (యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ-ఏజ్ గవర్నెన్స్) యాప్ ద్వారా సులభంగా మార్కుల జాబితాను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ ఏడాది ఫిబ్రవరి 17న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు మార్చి 11 వరకు సాగాయి. దేశవ్యాప్తంగా సుమారు 25 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. బోర్డు నిబంధనల ప్రకారం పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో ప్రక్రియ సజావుగా ముగిసింది. ఫలితాల వెల్లడిలో పారదర్శకతకు పెద్దపీట వేసిన బోర్డు.. డిజిటల్ ప్లాట్ఫారమ్స్ ద్వారా విద్యార్థులకు వేగంగా సమాచారం చేరవేస్తోంది.
సెషన్ -2 ఎగ్జామ్ షెడ్యూల్..
తొలి విడత ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చిన వారు లేదా స్కోరు మెరుగుపరుచుకోవాలని భావించే వారి కోసం బోర్డు రెండో అవకాశం కల్పిస్తోంది. మే 15 నుంచి సెషన్-2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్కుల ఇంప్రూవ్మెంట్ ఆశించే విద్యార్థులు ఈ విడతలో తమ ప్రతిభను చాటుకోవచ్చు. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ వివరాలను బోర్డు త్వరలోనే తన వెబ్సైట్లో పొందుపరుస్తుంది.
మరోవైపు 12వ తరగతి ఫలితాల కోసం వేచి చూస్తున్న విద్యార్థులకు కూడా కీలక అప్డేట్ అందింది. సీనియర్ సెకండరీ ఫలితాలను వచ్చే నెల రెండో వారంలో విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మూల్యాంకన ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో మే రెండో వారంలో రిజల్ట్స్ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది
ఫలితాలను చెక్ చేసుకునే విధానం..
* స్మార్ట్ఫోన్లో ఉమాంగ్ (UMANG) యాప్ను ఓపెన్ చేయాలి.
* సీబీఎస్ఈ (CBSE) సెక్షన్ను ఎంచుకోవాలి.
* టెన్త్ క్లాస్ రిజల్ట్స్ లింక్పై క్లిక్ చేయాలి.
* రోల్ నంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలు నమోదు చేయాలి.
* స్క్రీన్పై కనిపించే మార్కుల మెమోను సేవ్ చేసుకోవాలి.
ALSO READ: రూ.93,960 జీతంతో.. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో ఉద్యోగాలు, లాస్ట్ డేట్ ఇదే