TGPSC-TG High Court: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల గ్రూప్-1 ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. అయితే కొందరు గ్రూప్-1 అభ్యర్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష పేపర్లను రీవాల్యుయేషన్ జరిపించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. మూల్యాంకనంలో లోపభూయిష్టంగా జరిగిందని ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రూప్-1 అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేశారు.
తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం..
అయితే, పిటిషన్ లో అభ్యర్థులు ఈ విధంగా పేర్కొన్నారు. ‘మొత్తం 18 రకాల సబ్జెక్టులు అయితే 12 సబ్జెక్టుల నిపుణులతోనే పేపర్లను వాల్యూయేషన్ చేయించారు. 3 భాషల్లో పరీక్ష జరిగినా తగిన విద్యా నిపుణులతో పేపర్లను సరిగ్గా దిద్దంచలేదు. ఒకే భాషలో నిపుణులైన, ప్రావీణ్యం ఉన్న వారితో తెలుగు, ఇంగ్లీష్ మీడియం పేపర్లు మూల్యాంకనం చేయించారు. అలా చేయడం వల్ల పేపర్ వాల్యూయేషన్ లో నాణ్యత లోపించింది. తెలుగు మీడియం అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగింది’ అని పిటిషన్ లో పేర్కొన్నారు.
నాలుగు వారాలకు వాయిదా..
పిటిషనర్ల వాదనలు విన్న హైకోర్టు.. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC)కి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని టీజీపీఎస్సీ ని ఆదేశించింది. పిటిషన్పై తదుపరి విచారణను న్యాయస్థానం నాలుగు వారాలకు వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది.
గ్రూప్-1 ప్రధాన పరీక్షలకు మొత్తం 21,093 మంది హాజరు కాగా.. ఫలితాల వెల్లడిలో భాగంగా 2 వారాల క్రితం ప్రధాన పరీక్షల మార్కుల వివరాలను టీజీపీఎస్సీ అఫీషియల్ వెబ్ సైట్ లో పేర్కొంది. ఆ తరువాత అభ్యర్థుల నుంచి రీకౌంటింగ్ ఆప్షన్లు స్వీకరించి, ఆ ప్రక్రియ ముగిసిన అనంతరం 1:2 నిష్పత్తిలో జాబితా వెల్లడించనున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతేడాది అక్టోబర్ నెలలో గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్లో 67.17 శాతం హాజరు నమోదైంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షల్లో అర్హత పొందిన అభ్యర్థులకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని 46 పరీక్ష కేంద్రాల్లో ప్రధాన పరీక్షలు రాశారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్లో మొత్తం ఏడు పేపర్లకు 21,093 మంది అభ్యర్థులు అటెండ్ అయ్యారు. అక్టోబర్ 21 నుంచి నిర్వహించిన పరీక్షలు అక్టోబర్ 27 తో ముగిశాయి. మొత్తం 563 పోస్టుల భర్తీకి నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు మొత్తం 31,403 మంది అర్హత సాధించిన విషయం తెలిసిందే. వీళ్లలో హైకోర్టు అనుమతితో పరీక్షలకు హాజరైన 20 మంది స్పోర్ట్స్ క్యాటగిరీ అభ్యర్థులు కూడా ఉన్నారు.
తక్కువ మార్కులు వచ్చాయని ఆవేదన
అయితే ఫలితాలు విడుదలైన తర్వాత.. తెలుగు మీడియం అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కొన్నేళ్లుగా గ్రూప్స్ పరీక్షలకు సీరియస్ గా ప్రిపేర్ అయిన సరిగా మార్కులు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జామ్స్ బాగా రాసిన తెలుగు మీడియం అభ్యర్థులకు తక్కువ మార్కులు వేశారని.. ఇంగ్లిష్ మీడియం అభ్యర్థులు ఎక్కువ మార్కులు వేశారని ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్-1 ఫలితాల్లో తక్కువ మార్కులు రావడంతో తల్లిదండ్రులకు ఏం చెప్పాలో తెలియలేక సతమతం అవుతున్నారు. ఈ క్రమంలోనే తమకు న్యాయం జరగాలని గ్రూప్-1 అభ్యర్థులు పిటిషన్ వేశారు.
ALSO READ: JOBS: తెలంగాణలో ఆ జిల్లాలో ఉద్యోగాలు.. స్టార్టింగ్ జీతమే రూ.60,000.. మీరు కూడా అర్హులే..!