పోస్టల్ శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తీపి కబురు అందింది. 2026 ఏడాదికి సంబంధించి దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 28,636 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల ఫలితాలు వెలువడ్డాయి. మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేసిన అభ్యర్థుల మొదటి జాబితాను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. ఈ నియామక ప్రక్రియలో ఎంపికైన వారి వివరాలను అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు.
కేవలం పదో తరగతి మార్కుల ఆధారంగానే ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1,060 ఖాళీలు కేటాయించగా తెలంగాణకు 608 పోస్టులు కేటాయించారు. ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియకు భారీ స్పందన లభించింది. తాజా జాబితా ప్రకారం ఏపీ నుంచి 1,048 మంది అలాగే తెలంగాణ నుంచి 607 మంది షార్ట్ లిస్ట్ అయ్యారు.
కంప్యూటర్ జనరేటెడ్ పద్ధతిలో మార్కుల మెరిట్ తో పాటు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి ఈ ఎంపికలు జరిగాయి. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు మార్చి 23వ తేదీ లోపు తమకు కేటాయించిన డివిజన్ కార్యాలయాల్లో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత వచ్చే వారిని పరిగణనలోకి తీసుకోరు. ఎంపికైన వారు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM) లేదా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది.
సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ సమయంలో అభ్యర్థులు తమ వెంట ఆన్లైన్ దరఖాస్తు పత్రం తో పాటు పదో తరగతి మార్కుల మెమో తీసుకువెళ్లాలి. డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ కు ఇది ప్రామాణికంగా ఉంటుంది. వీటితో పాటు ఒరిజినల్ స్టడీ సర్టిఫికెట్లు అలాగే రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు సిద్ధం చేసుకోవాలి. కుల ధ్రువీకరణ పత్రం తో సహా ఆధార్ కార్డు అలాగే ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. దివ్యాంగులు తమ కేటగిరీకి సంబంధించిన ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. వీటన్నింటితో పాటు మెడికల్ సర్టిఫికెట్ కూడా వెంట ఉంచుకోవాలి.
తపాలా శాఖలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్న గ్రామీణ యువతకు ఇది గొప్ప అవకాశం. జాబితాలో పేరున్న వారు నిర్దేశించిన గడువులోగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. ఏదైనా సమాచారం కోసం వెబ్సైట్ను క్రమం తప్పకుండా పరిశీలించాలని కోరారు.
షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల జాబితా కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://indiapost.gov.in
ALSO READ: Engineering Fees: ఇంజినీరింగ్ ఫీజులను ఫిక్స్ చేసిన ప్రభుత్వం.. ఉత్తర్వులు జారీ!