నిరుద్యోగులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నూతన సంవత్సర కానుకను అందించింది. దేశవ్యాప్తంగా ఉన్న తన పరిధిలో ఉన్న వివిధ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న 572 ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే పదో తరగతి అభ్యర్థులకు ఇదొక అద్భుతమైన అవకాశంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.
ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు విధానం..
ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2026 జనవరి 15 నుంచి ప్రారంభం కానుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ 2026 ఫిబ్రవరి 4. గడువు ముగిసేలోపు అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలి.
దరఖాస్తుకు ప్రారంభ తేది: జనవరి 15
దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 4
అర్హత, వయోపరిమితి..
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి పదో తరగతి (SSC) ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు విషయానికి వస్తే, 2026 జనవరి 1 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు, ఎంపిక ప్రక్రియ..
ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభంలోనే నెలకు సుమారు రూ. 46,029 వరకు వేతనం లభిస్తుంది. సెంట్రల్ బ్యాంక్ ఉద్యోగం కావడంతో జీతంతో పాటు ఇతర అలవెన్సులు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. అభ్యర్థుల ఎంపిక పూర్తిగా ఆన్లైన్ రాత పరీక్ష ఆధారంగా జరుగుతుంది. దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష
ఫీజు వివరాలు
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 450 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ,మాజీ సైనికోద్యోగులకు (ESM) ఫీజులో రాయితీ ఉంటుంది, వారు కేవలం రూ. 50 చెల్లిస్తే సరిపోతుంది. పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని బ్యాంకులో కొలువు సాధించాలనుకునే వారికి ఇది నిజంగా గోల్డెన్ ఛాన్స్.
అఫీషియల్ వెబ్ సైట్: https://opportunities.rbi.org.in/