APSRTC Driver Nagaraju: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) డ్రైవర్ విధి నిర్వహణలో ఉండగానే గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న అమరావతి ఏసీ బస్సును నడుపుతుండగా, ఒక్కసారిగా అస్వస్థతకు గురైన డ్రైవర్ తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణికులను రక్షించారు. గుండెల్లో నొప్పి వస్తున్నా సంయమనం కోల్పోకుండా, బస్సును చాకచక్యంగా రోడ్డు పక్కకు ఆపిన కొద్దిసేపటికే ఆయన సీటులోనే కుప్పకూలిపోయారు.
విజయవాడ డిపోకు చెందిన నాగరాజు (గొల్లపూడి నివాసి) ఈ బస్సును నడుపుతున్నారు. చౌటుప్పల్ సమీపంలోకి రాగానే ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. ఆ సమయంలో బస్సులో 19 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు వేగంగా ఉన్నప్పటికీ, తన ప్రాణం పోతున్నా ప్రయాణికుల భద్రతనే లక్ష్యంగా పెట్టుకుని బస్సును సురక్షితంగా పక్కకు నిలిపివేశారు. వెంటనే ప్రయాణికులు ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించినప్పటికీ, పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు.
ఈ ఘటనతో బస్సులోని ప్రయాణికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. తమ ప్రాణాలను కాపాడి డ్రైవర్ నాగరాజు తనువు చాలించడం పట్ల వారు కన్నీటి పర్యంతమయ్యారు. ఆర్టీసీ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నాగరాజు మృతితో విజయవాడ డిపోలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Read Also: చూస్తుండగానే కాలి బూడిదైన మహీంద్రా ఈవీ, కంపెనీ ఏం చెప్పిందంటే?