డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) దేశవ్యాప్తంగా తన శాఖల్లో అప్రెంటిస్షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ముంబయిలోని మానవ వనరుల శాఖ సెంట్రల్ ఆఫీస్ ఈ ప్రకటనను వెలువరించింది.
మొత్తం 1,865 ఖాళీలను ఒక ఏడాది కాలానికి ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో 164 పోస్టులు ఆంధ్రప్రదేశ్లో 303 పోస్టులు కేటాయించారు. అభ్యర్థులు తమ అర్హతలను బట్టి మే 19వ తేదీ లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1865
మొత్తం ఖాళీలను సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే అన్రిజర్వ్డ్ కేటగిరీలో 823 పోస్టులు ఉన్నాయి. ఎస్సీలకు 289 ఎస్టీలకు 131 ఓబీసీలకు 447 ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 175 ఖాళీలు కేటాయించారు.
విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు. 2026 ఏప్రిల్ 1వ తేదీ నాటికి విద్యార్హత కలిగి ఉండాలి. స్థానిక భాషపై పట్టు ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. దరఖాస్తు చేసుకునే రాష్ట్ర స్థానిక భాషలో మాట్లాడటం రాయడం చదవడం తప్పనిసరి.
వయస్సు: 2026 ఏప్రిల్ 1 నాటికి అభ్యర్థుల వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు గరిష్టంగా 15 ఏళ్ల వరకు వయో సడలింపు ఉంటుంది.
స్టైఫండ్: ఎంపికైన వారికి ఒక సంవత్సరం పాటు శిక్షణ ఇస్తారు. శిక్షణ సమయంలో ఇచ్చే స్టైపెండ్ అభ్యర్థి పనిచేసే ప్రాంతంపై ఆధారపడి ఉంటుంది. రూరల్ లేదా సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.15,000 చెల్లిస్తారు. అర్బన్ ఏరియాలో రూ.18,000 మెట్రో నగరాల్లో రూ.20,000 వరకు స్టైపెండ్ లభిస్తుంది.
సెలెక్షన్ ప్రాసెస్: ఎంపిక ప్రక్రియలో భాగంగా ఆన్లైన్ ఆబ్జెక్టివ్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో జనరల్ అవేర్నెస్, ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటాయి. యూనియన్ బ్యాంక్ సేవలపై కూడా ప్రశ్నలు అడుగుతారు.
పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్/ఫైనాన్షియల్ అవేర్నెస్ 20 మార్కులు జనరల్ ఇంగ్లిష్ 20 మార్కులు క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ 20 మార్కులు కంప్యూటర్ లేదా సబ్జెక్ట్ నాలెడ్జ్ 20 మార్కులు బ్యాంక్ ఉత్పత్తులు 20 మార్కులు చొప్పున కేటాయించారు. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఆన్లైన్ పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారికి స్థానిక భాషా నైపుణ్య పరీక్ష నిర్వహిస్తారు.
దరఖాస్తు ఫీజు: కేటగిరీల వారీగా మారుతుంది. జనరల్, ఓబీసీ, పురుష అభ్యర్థులు రూ.944 చెల్లించాలి. ఇదే కేటగిరీకి చెందిన మహిళలు రూ.708 కట్టాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్ అభ్యర్థులకు రూ.236 రుసుముగా నిర్ణయించారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 2026 ఏప్రిల్ 29న ప్రారంభమవుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు మే 19వ తేదీ లోగా అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: మే 19
ఆన్లైన్ పరీక్షను మే లేదా జూన్ నెలలో నిర్వహించే అవకాశం ఉంది
ALSO READ: ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కు శంకుస్థాపన.. గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతామన్న సీఎం రేవంత్ రెడ్డి