యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ప్రతిష్ఠాత్మకమైన సివిల్ సర్వీసెస్ – 2025 తుది ఫలితాలను శుక్రవారం మధ్యాహ్నం వెల్లడించింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ కఠినమైన పరీక్షలో అనూజ్ అగ్నిహోత్రి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. అగ్రశ్రేణి పది మంది విజేతల్లో రాజేశ్వరి సువె ద్వితీయ స్థానాన్ని దక్కించుకోగా అకాన్ష్ ధూల్ మూడో స్థానంలో నిలిచారు. వారి తర్వాత రాఘవ్ ఝున్ఝున్వాలా, ఇషాన్ భట్నాగర్, జిన్నియా అరోడా, ఏఆర్ రజా మొహియిద్దీన్, పక్షల్ సెక్రటరీ, అస్థా జైన్, ఉజ్వల్ ప్రియాంక్ వరుసగా టాప్-10లో చోటు సంపాదించారు.
1. అనూజ్ అగ్నిహోత్రి
2. రాజేశ్వరి సువె
3. అకాన్ష్ ధూల్
4. రాఘవ్ ఝున్ఝున్వాలా
5. ఇషాన్ భట్నాగర్
6. జిన్నియా అరోడా
7. ఏఆర్ రజా మొహియిద్దీన్
8. పక్షల్ సెక్రటరీ
9. అస్థా జైన్
10. ఉజ్వల్ ప్రియాంక్
ఈ ఏడాది మొత్తం 958 మంది అభ్యర్థులు వివిధ సర్వీసులకు ఎంపికయ్యారు. కేటగిరీల వారీగా చూస్తే జనరల్ విభాగంలో 317 మంది, ఓబీసీ కేటగిరీలో 306 మంది, ఎస్సీ విభాగంలో 158 మంది ఎంపికయ్యారు. అలాగే ఈడబ్ల్యూఎస్ కోటాలో 104 మంది, ఎస్టీ విభాగంలో 73 మంది తుది జాబితాలో నిలిచారు. కేంద్ర ప్రభుత్వంలోని ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ వంటి కీలక విభాగాల్లో ఖాళీల భర్తీ కోసం యూపీఎస్సీ ఈ ఎంపిక ప్రక్రియను మూడు దశల్లో నిర్వహించింది.
గతేడాది మే 25న జరిగిన ప్రిలిమ్స్ పరీక్షతో మొదలైన ఈ ప్రయాణం 2025 ఆగస్టు 22 నుంచి 31 వరకు జరిగిన మెయిన్ పరీక్షలతో కీలక దశకు చేరుకుంది. మెయిన్స్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు గతేడాది డిసెంబర్ నుంచి 2026 ఫిబ్రవరి వరకు దశల వారీగా ఇంటర్వ్యూలు నిర్వహించి తాజాగా ఫలితాలను ఖరారు చేశారు. విజేతల మార్కుల జాబితాను మరో 15 రోజుల్లోపు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు ప్రకటించారు.
జాతీయ స్థాయిలో మెరిసన తెలుగు తేజం
ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు తమ సత్తా చాటారు. జాతీయ స్థాయిలో సృజన 55వ ర్యాంకుతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. డీఎస్కే ప్రచేత్ (193), ఎస్ వర్షిత్ రెడ్డి (259), ఎం.పవన్కుమార్ రెడ్డి (297) మెరుగైన ర్యాంకులు సాధించారు. వీరితో పాటు వెలిమినేటి విక్రమసింహారెడ్డి (541), గుమ్మల శ్వేత (573), పల్లి ప్రమోద్ విష్ణు (640), గుమ్మల విజయసింహారెడ్డి (682), పోతుపురెడ్డి భార్గవ్ (738), పుడారి రాహుల్ (748) విజేతల జాబితాలో నిలిచారు. కుమ్మరి శ్రవణ్కుమార్ (768), అనిరుధ్ కత్తిమాని (786), కోరపోతుల శ్రీకర్ రాజు (806), ఇస్లావత్ శ్రీరామ్ హర్ష (823), కట్టా ప్రత్యూష (908), గోగుల రాజశేఖర్ (920), గుగులోతు జితేందర్ నాయక్ (939) సివిల్స్లో తమ ముద్ర వేశారు.
ఏదైనా డౌట్ ఉంటే….
అభ్యర్థులకు ఏవైనా సందేహాలుంటే నివృత్తి చేసుకునేందుకు యూపీఎస్సీ ఫెసిలిటేషన్ కౌంటర్ ఏర్పాటు చేసింది. పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వయంగా కానీ లేదా ఫోన్ నంబర్ల ద్వారా కానీ అధికారులను సంప్రదించవచ్చు.
ALSO READ: IDBI Recruitment: డిగ్రీ అర్హతతో 1300 ఉద్యోగాలు.. మంచి వేతనం, డోంట్ మిస్