![](https://bigtvlive.com/wp-content/uploads/2022/11/elon.jpg)
Twitter : ఊహించిందే జరగబోతోంది. ట్విట్టర్ డీల్ పూర్తైతే 75 శాతం మంది ఉద్యోగులను తీసేస్తారని ప్రచారం జరిగినట్లుగానే… కొత్త బాస్ ఎలాన్ మస్క్ నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే 75 శాతం మందిని కాదు… 50 శాతం మంది ఉద్యోగుల్ని మాత్రమే పీకేయబోతున్నాడు… మస్క్.
వ్యయ నియంత్రణలో భాగంగా దాదాపు 3,700 మంది సిబ్బందిని ట్విట్టర్ నుంచి తీసేసే ఛాన్స్ ఉందని… బ్లూమ్బెర్గ్ తెలిపింది. కొన్ని గంటల్లోనే ఉద్యోగాల నుంచి తొలగించిన వారి జాబితా బైటికి రావొచ్చని వెల్లడించింది. అలాగే… ట్విట్టర్లో ప్రస్తుతం అమల్లో ఉన్న వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి కూడా మస్క్ గుడ్ బై చెప్పే ఛాన్స్ ఉందంటున్నారు. కొందరు మినహా… మిగిలిన వాళ్లంతా కంపెనీకి వచ్చి పనిచేయాల్సిందేనని… లేదా కంపెనీ నుంచి వెళ్లిపోవాలని మస్క్ త్వరలోనే ఆదేశాలు జారీ చేయబోతున్నారని చెబుతున్నారు. ఉద్యోగుల తొలగింపు సహా, సంస్థలో ఇతర మార్పులపై మస్క్ తన సలహాదారులతో విస్తృతంగా చర్చిస్తున్నారని… కంపెనీ ప్రతినిధులే వెల్లడించారు. అయితే… తీసేసిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన పరిహారం పైనే మస్క్ ఎటూ తేల్చుకోలేక పోతున్నారని చెబుతున్నారు. తీసేయాలనుకున్న వారికి రెండు నెలల జీతం ఇచ్చి సాగనంపే ఆలోచనలో మస్క్ ఉన్నారని అంటున్నారు.
మస్క్ నిర్ణయాలతో గతంలో టెస్లా ఉద్యోగులు కూడా అభద్రతాభావానికి లోనయ్యారు. ఈ ఏడాది జూన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అంశంలో టెస్లా ఉద్యోగులకు మస్క్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై టెస్లా ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం కుదరదని తేల్చి చెప్పారు. ఇష్టం లేకపోతే టెస్లాలో జాబ్కు రిజైన్ చేసి వెళ్లిపోవచ్చంటూ ఉద్యోగులకు మెయిల్స్ పెట్టారు. మస్క్ మెయిల్ ను ఓ ఉద్యోగి బయటపెట్టాడు. టెస్లా ఉద్యోగుల్లో ఎవరైనా రిమోట్ వర్క్ చేయాలని అనుకుంటే… వారంలో కనీసం 40 గంటలు ఆఫీస్లోనే పని చేయాలని, అంతకు మించి పని గంటలు ఉంటే ఎక్కడి నుంచైనా పని చేసుకోవచ్చని మస్క్ మెయిల్లో పేర్కొన్నాడు. అదే తరహాలో ట్విటర్ ఉద్యోగులకు కూడా మస్క్ వార్నింగ్ ఇవ్వబోతున్నారని బ్లూమ్బెర్గ్ అనుమానం వ్యక్తం చేసింది. ఒకవేళ మస్క్ ట్విట్టర్ ఉద్యోగులకు మెయిల్ పంపితే… ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.