Errolla Srinivas: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మేము ఎక్కడా చెప్పలేదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) మాట్లాడటం దుర్మార్గం అని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్(Errolla Srinivas) మండిపడ్డారు. మీడియా ప్రకటన విడుదల చేశారు. ఓట్లు దండుకోవడం కోసం ఆనాడు ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డిసాక్షిగా విడుదల చేసిన హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ లోని మొదటి పేజీలో, మొదటి పాయింట్గా రాసిచ్చిన హామీని ఇప్పుడు తుంగలో తొక్కుతారా? అని ప్రశ్నించారు
అధికారంలోకి రాకముందేమో పేపర్లలో ప్రకటనలు ఇచ్చి, ప్రచార సభల్లో గొంతు చించుకొని ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు అని ఊదరగొట్టారన్నారు. ఇప్పుడు తీరా అధికారంలోకి వచ్చాక మేము అనలేదు.. మా టర్మ్ ఐదేళ్లలో ఇస్తాం అన్నాం అని మాట మార్చడం నిరుద్యోగులను, తెలంగాణ యువతను మోసం చేయడమేఅని దుయ్యబట్టారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాము 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటోందన్నారు. ఆ 60 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఎగ్జామ్స్ పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి నియామక ప్రక్రియ పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు.
అన్నీ సిద్ధం చేశాక, కేవలం అపాయింట్మెంట్ లెటర్లు చేతికి ఇచ్చి, ఆ ఉద్యోగాలను మీ ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటు అని, ఇత్తు వేసి పొత్తు కూడినట్టు ఉంది మీ తీరు అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం సొంతంగా నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్ష పెట్టి భర్తీ చేసిన ఉద్యోగాలు 5 వేలకు మించి లేవు అని, మిగతావన్నీ కేసీఆర్ హయాంలో భర్తీ చేసినవే అన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన హామీని పీసీసీ అధ్యక్షుడే ఇలా అబద్ధం అని చెప్పడం కాంగ్రెస్ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు. ఇప్పటికైనా అబద్ధాలు ఆడటం మాని, మీరు ఇచ్చిన హామీ ప్రకారం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి డిమాండ్ చేశారు.
Also Read: Maoists Surrender: మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. మరో నలుగురు లొంగుబాటు