Doodle : భారత్ లోని 100 నగరాలు. 1,15,000 ఎంట్రీలు. 1 నుంచి 10 తరగతి వరకు విద్యార్థులకు పోటీ. ఇందులో గెలిచింది ఎవరో తెలుసా! కోల్ కతాకు చెందిన శ్లోక్ ముఖర్జీ అనే విద్యార్థి. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన ఈ విద్యార్థి రూపొందించిన డూడుల్ అందరినీ ఆలోచింప చేసేలా ఉంది. ఇండియా ఆన్ ది సెంటర్ స్టేజ్ అనే స్ఫూర్తిదాయకమైన డూడుల్ ని రూపొందించి భారత దేశం నుంచి విజేతగా నిలిచాడు. ఐదు కేటగిరీల్లో ఇష్టమైన డూడుల్ ని ఎంచుకోవాలంటూ నెటిజన్లను కోరింది గూగుల్. రాబోయే 25 ఏళ్లలో నా భారతదేశం అనే థీమ్ పై పోటీలు నిర్వహించారు. డూడుల్ పోటీల్లో 20 మంది ఫైనలిస్ట్ లను ఎంపిక చేసిన రెండు వారాల తర్వాత అత్యుత్తమ డూడుల్ ని ప్రకటించింది గూగుల్. అంతేకాదు దీన్ని బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న అంటే ఇవాళ గూగుల్ సర్చ్ ఇంజిన్ మొదటి పేజీలో డిస్ ప్లే చేసింది.
సాధారణంగా గూగుల్ సందర్భాన్ని బట్టి డూడుల్ ని డిస్ ప్లే చేస్తుంది. వీటిలో కొన్ని ఆలోచింప చేస్తే… మరికొన్ని స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. వీటి నుంచి కొత్త కొత్త సంగతులను కూడా నేర్చుకోవచ్చు. అందుకే ప్రతీ సంవత్సరం గూగుల్ డూడుల్ పోటీలను పెట్టి విజేతలను ప్రకటిస్తుంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ పోటీలు జరుగుతుంటాయి.
ఇక ఈ పోటీలో విజేతలకు భారీ నజరానాలే ప్రకటించింది. విజేతగా నిలిచిన వారికి రూ.5 లక్షల కాలేజ్ స్కాలర్ షిప్, రూ.2 లక్షల టెక్నాలజీ ప్యాకేజీని అందించనున్నట్లు గూగుల్ సంస్థ వెల్లడించింది. వీటితోపాటు ట్రోఫీ ఆఫ్ అచీవ్ మెంట్, గూగుల్ హార్డ్ వేర్ డివైస్ లను గిఫ్ట్ గా ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇక ఈ పోటీలు దాదాపు 13 ఏళ్ల నుంచి గూగుల్ నిర్వహిస్తూ వస్తోంది.