Twitter-employees : ట్విట్టర్ కొన్నది మొదలు ఉద్యోగులనే టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్… ఇప్పటికే కొందర్ని తొలగించాడు. విభాగాల వారీగా ఇంకా ఎవరెవర్ని తొలగించాలో ఓ లిస్ట్ ఇవ్వాల్సిందిగా మేనేజర్లను ఆదేశించిన మస్క్… ఇప్పుడు మరో ట్విస్ట్ ఇచ్చాడు. ఉద్యోగం ఉండాలంటే రోజూ 12 గంటల పాటు పని చేయాలని ఎంప్లాయిస్ ని ఆదేశించాడు. సిబ్బందికి ఇప్పటికే టాస్క్లు, డెడ్లైన్స్ విధించడంతో… మేనేజర్ స్థాయిలోని కొందరు ఉద్యోగులు వీకెండ్లో తీరికలేకుండా పని చేశారని… ఇంటికెళ్లే సమయం కూడా లేక రాత్రిపూట ఆఫీసులోనే నిద్రపోయారని అమెరికా మీడియా వెల్లడించింది.
ఎలాన్ మస్క్ ట్విట్టర్ ఆఫీసులో అడుగుపెట్టినప్పటి నుంచి ఉద్యోగులు వారంలో ఏడు రోజులూ, 84 గంటలూ పనిచేస్తున్నారని అమెరికా మీడియా అంటోంది. ఉద్యోగంపై వేటు పడకుండా… కొత్త బాస్ మస్క్ ముందు తమను తాము నిరూపించుకునేందుకు ఉద్యోగులు తీవ్రంగా శ్రమిస్తున్నారని చెబుతోంది. మరికొందరు ఉద్యోగులు మాత్రం… పని గంటలు ఎక్కువ కావడం, ఉద్యోగ భద్రత లేకపోవడంతో… ఇతర సంస్థల్లో ఉద్యోగాలు వెతుక్కుంటున్నారని విశ్లేషిస్తోంది. తాజా ట్విట్టర్ చీఫ్ కస్టమర్ ఆఫీసర్, ప్రకటనల విభాగాధిపతి సారా పర్సొనెటె, చీఫ్ పీపుల్ అండ్ డైవర్సిటీ ఆఫీసర్ డలానా బ్రాండ్, కోర్ టెక్ జనరల్ మేనేజర్ నిక్ కాల్డ్వెల్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ లెస్లీ బెర్లాండ్ కూడా కంపెనీని వీడారని అమెరికా మీడియా చెబుతోంది.
మరోవైపు… కీలక ఉద్యోగులు ఒక్కొక్కరే సంస్థను వీడుతుంటడంతో… తన ఇతర కంపెనీల్లోని పనిచేసే ఉద్యోగులను మస్క్ ట్విట్టర్లో సర్దుబాటు చేస్తున్నారు. ఇప్పటికే టెస్లా ఆటోపైలట్ టీమ్ నుంచి 50 మంది, బోరింగ్ కంపెనీ నుంచి ఇద్దరు, న్యూరాలింక్ నుంచి ఒకరు ట్విటర్కు వెళ్లినట్లు అమెరికా మీడియా అంటోంది. మొత్తానికి తన చేతుల్లోకి వచ్చినప్పటి నుంచి ట్విట్టర్ పిట్టను మస్క్ ఇష్టం వచ్చినట్లు నలిపేస్తున్నాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.