RS 2000 : రూ.2 వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకున్నామని ఆర్బీఐ ప్రకటించినప్పటి నుంచి ప్రజల్లో అనేక సందేహాలు ఏర్పడ్డాయి. నోట్లను మార్చుకునే సమయంలో ఫారం నింపాల్సి ఉంటుందని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఏదైనా గుర్తింపు ధ్రవపత్రాన్ని సమర్పించాలని ఊహాగానాలు వచ్చాయి. ఇలాంటి వార్తలపై తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లారిటీ ఇచ్చింది.
రూ.2 వేల నోట్ల మార్పిడికి ఎలాంటి పత్రం నింపాల్సిన అవసరం లేదని ఎస్బీఐ స్పష్టం చేసింది. రూ.20 వేల వరకు బ్యాంకులో నేరుగా మార్చుకోవచ్చని పేర్కొంది. ఎలాంటి ఐడీ ప్రూఫ్ ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపింది. నోట్ల మార్పిడి సమయంలో రిక్విజషన్ ఫారం నింపాల్సి ఉంటుందని.. దానికి ఆధార్ కార్డ్ లేదా ఇతర గుర్తింపు కార్డులు ప్రూఫ్గా సమర్పించాలని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ రూమర్లపై తాజాగా ఎస్బీఐ స్పష్టతనిచ్చింది. అన్ని బ్యాంకు శాఖలకు ఎస్బీఐ ఆపరేషన్స్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎస్.మురళీధరన్ ఉత్తర్వులు జారీ చేశారు.
చలామణి నుంచి రూ.2 వేల నోటును ఉపసంహరిస్తున్నామని శుక్రవారం ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ నోట్లు ఉన్న ప్రజలు వాటిని ఈనెల 23 నుంచి సెప్టెంబర్ 30లోపు బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవాలని సూచించింది.క్లీన్ నోట్ పాలసీ కింద ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది.