Telangana junior lecturer exam: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీఎస్పీఎస్సీ) ఇటీవల ప్రకటించిన జూనియ్ లెక్చరర్ ఫలితాల్లో మెట్పల్లి కి చెందిన జనమంచి సాయిశిల్ప ఉత్తీర్ణత సాధించింది. ఫలితాల్లో ఈమె రాష్ట్ర ప్రథమ ర్యాంకు సాధించింది. ఇంగ్లీష్ సబ్జెక్టులో 450 మార్కులకు గాను 325.657 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. గతంలో నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు సాయిశిల్ప ఎంపికయ్యింది. అదేవిధంగా తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ల ఇనిస్టిట్యూషన్స్ రిక్రూట్ మెంట్ బోర్డు(గురుకులం పాఠశాలలు) నిర్వహించిన డిగ్రీ లెక్చరర్ రిక్రూట్ మెంట్ టెస్టులో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించి రికార్డ్ సృష్టించింది.
ఇబ్రహీంపట్నం మండల పరిషత్ పాఠశాలలో ప్రాథమిక ఉపాధ్యాయురాలిగా విధులకు హాజరవుతూనే పరీలకు సిద్ధమైంది సాయిశిల్ప. మెట్పల్లి పట్టణంలోని కళానగర్ కు చెందిన ఆమె.. మెట్పల్లిలో పాఠశాల విద్యను పూర్తి చేసింది. 2012-14లో కోరుట్లలో టీటీసీ చదివింది. 2017-19 విద్యా సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేసింది. టీఎస్ సెట్, నెట్, జేఆర్ఎఫ్లకు కూడా సాయి శిల్ప అర్హత సాధించింది.
Also Read: తెలంగాణ కొత్త డీజీపీగా జితేందర్
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తనకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేసింది. తన కుటుంబ సభ్యుల సహకారంతోనే ఈ ర్యాంక్ సాధ్యమైందన్నది. ప్రస్తుతం ఓయూలో పీహెచ్ డీ చేస్తున్న ఆమెకు ప్రొఫెసర్ కావాలనుకుంటున్నట్లు తెలిపింది.