తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పౌరసరఫరాల శాఖ తన తొలి వారపు కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రారంభించింది. ఈ ప్రణాళికలో భాగంగానే రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ అలాగే ప్రభుత్వ ఎక్స్-అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీ స్టీఫెన్ రవీంద్ర ఐపీఎస్ మార్గదర్శకత్వంలో పౌరసరఫరాల భవన్లో భారీ పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. మార్చి 6 నుండి మార్చి 15 వరకు కొనసాగే ‘రాష్ట్రవ్యాప్త సంస్థాగత పరిశుభ్రత – ఫైళ్ల పరిష్కార డ్రైవ్’ పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
ఈ డ్రైవ్లో భాగంగా పౌరసరఫరాల భవనంలోని ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. కేవలం ప్రధాన కార్యాలయంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పౌరసరఫరాల శాఖా కార్యాలయాలు సహా ఎంఎల్ఎస్ పాయింట్లు అలాగే గోదాముల్లో ఈ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. కార్యాలయ ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు రికార్డు గదులను క్రమబద్ధీకరించడం ఈ తొలి వారపు ప్రధాన లక్ష్యం. పరిపాలనలో పారదర్శకత పెంచేందుకు అధికారులు సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.
ముఖ్యంగా ఏళ్ల తరబడి పేరుకుపోయిన పాత ఫైళ్లను గుర్తించి వాటిని నిబంధనల ప్రకారం పరిష్కరించే ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. పెండింగ్లో ఉన్న పరిపాలనా పరమైన అంశాలను త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని కమిషనర్ పేర్కొన్నారు. దీనివల్ల కార్యాలయ పనితీరు మెరుగుపడటంతో పాటు సిబ్బందిలో యాక్టివ్ గా పని చేసే అవకాశం ఉంటుంది. ఫైళ్ల వర్గీకరణ ద్వారా భవిష్యత్తులో సమాచార సేకరణ ఈజీగా కూడా అవుతోందని అధికారులు పేర్కొన్నారు.
కార్యాలయాల్లో అనవసరంగా ఉన్న పాత సామాగ్రి అలాగే స్క్రాప్ వస్తువులను తొలగించి కార్యాలయాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్నారు. నిరుపయోగంగా ఉన్న ఫర్నిచర్ అలాగే ఎలక్ట్రానిక్ వ్యర్థాలను పారేయడం వల్ల కార్యాలయాల్లో ఖాళీ ప్రదేశం ఏర్పడి పని వాతావరణం మెరుగుపడుతుంది. ప్రతి ఉద్యోగి తన పని ప్రదేశాన్ని పవిత్రంగా భావించి ఈ స్వచ్ఛతా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
తొమ్మిది రోజుల పాటు సాగే ఈ తొలి థీమ్ కార్యక్రమాలు పౌరసరఫరాల శాఖలో పాలనలో మార్పును తీసుకురానున్నాయి. ప్రజలకు నిత్యావసర సేవలు అందించే ఈ కీలక శాఖలో ఫైళ్ల పరిష్కారం జరగడం వల్ల సామాన్యులకు పాలన మరింత చేరువవుతుంది. ప్రభుత్వం నిర్దేశించిన 99 రోజుల లక్ష్యాలను నిర్ణీత సమయంలోగా పూర్తి చేసేందుకు శాఖా పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
ALSO READ: CM Chandrababu: విశ్వ వ్యాప్తంగా ఏపీ బ్రాండ్ ఇమేజ్.. రైసినా డైలాగ్ వేదికపై సీఎం చంద్రబాబు