తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: బీఆర్ఎస్.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు బీ-టీమ్ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నుంచి తాము, తమ పార్టీ నేర్చుకోవాల్సిందేమీ లేదని స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో వెళ్లేందుకు బీఆర్ఎస్ తహతహలాడుతోందని విమర్శించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీజేపీ చేస్తున్న ఆరోపణలనే తెలంగాణలో బీఆర్ఎస్ కూడా చేస్తున్నదని వ్యాఖ్యానించారు. సైద్ధాంతికంగానే ఆర్ఎస్ఎస్తో కాంగ్రెస్ పార్టీకి వైరుధ్యమున్నదన్నారు. ఐఏసీసీ కొత్త ఆఫీసు ప్రారంభోత్సవానికి హాజరైన అనంతరం ఢిల్లీలో బుధవారం మీడియాతో సీఎం రేవంత్ మాట్లాడుతూ పై కామెంట్లు చేశారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ చెప్పినట్లు ఆర్ఎస్ఎస్తో తమ పార్టీకి సిద్ధాంతపరంగానే విభేదాలు ఉన్నాయన్నారు. స్వాతంత్ర్యం కోసం ఆర్ఎస్ఎస్ ఏనాడూ ఎలాంటి పోరాటం చేయలేదని.. సంఘ్ నేతలెవరూ త్యాగాలు చేయలేదని గుర్తుచేశారు. స్వాతంత్ర్య పోరాటంతో తమ సంఘ్కు ఎలాంటి సంబంధమూ లేదంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ (సర్ సంఘ్చాలక్) మోహన్ భగవత్ చెప్పారని సీఎం రేవంత్ గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు స్వాతంత్ర్య ఉద్యమంలో ఎన్నో త్యాగాలు చేశారని గుర్తు చేశారు.
బీజేపీ అంటే భారతీయ ఝూటా పార్టీ
స్వాతంత్ర్యానికి విరుద్ధంగా మాట్లాడినా, కించపరిచేలా వ్యాఖ్యలు చేసినా వారిపైన చట్టపరమైన విచారణ చేయాలని డిమాండ్ చేసిన సీఎం రేవంత్… తాజాగా మోహన్ భగవత్ చేసిన కామెంట్ల నేపథ్యంలో ఆయనపైనా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధాని మోడీ ఇప్పటివరకు భగవత్పై తీసుకున్న చర్యలేంటని ప్రశ్నించారు. మోడీ.. మోహన్ భగవత్ తోనో ఉంటారా? లేదంటే త్యాగాలు చేసిన కుటుంబాల వైపు ఉంటారా? అని ప్రశ్నించారు. బీజేపీ అంటే భారతీయ ఝూటా పార్టీ (అబద్ధాలు చెప్పే పార్టీ) అని వ్యాఖ్యానించారు. బీజేపీ చేసే కామెంట్లపై పెద్దగా దృష్టి పెట్టాల్సిన అవసరం లేదన్నారు.
తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన
తెలంగాణలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన జరగాలన్నదే కాంగ్రెస్ విధానమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. దాడులు జరిగితే పోలీసులు చూస్తూ ఊరుకోరని.. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందన్నారు. ప్రజల భద్రతకు ప్రమాదం ఏర్పడినప్పుడు పోలీసులు జోక్యం చేసుకుని క్రిమినల్ చర్యలు తీసుకోక తప్పదని, కేసులు నమోదు చేయడం అందులో భాగమన్నారు. బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల మీద దాడి జరిగిందని.. కానీ ప్రస్తుతం కానీ అధికారంలో ఉన్నప్పటికీ తమ పార్టీ శ్రేణులు ఆ పని చేయడంలేదన్నారు.
కేసీ వేణుగోపాల్తో రేవంత్ భేటీ
ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల (ఆర్గనైజింగ్) ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ బుధవారం సాయంత్రం సమావేశమయ్యారు. కేసీ వేణుగోపాల్ నివాసంలో జరిగిన ఈ భేటీకి రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు కూడా హాజరయ్యారు. దాదాపు గంటన్నరకు పైగా జరిగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన సంస్థాగత వ్యవహారాలతో పాటు ఏడాది పాలనలో ప్రభుత్వం అమలు చేసిన అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. కేసీ వేణుగోపాల్ ఇటీవల హైదరాబాద్ పర్యటన సందర్భంగా చర్చించిన పలు అంశాలతో పాటు మరికొన్నింటిపై ఈ భేటీలో పరస్పరం పంచుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ సమావేశంలో సీఎం రేవంత్తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, సీనియర్ నాయకుడు అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: రేపే ఈడీ విచారణకు కేటీఆర్.. ఆయన కోరుకున్నదే జరగనుందా?