Janvada Farm House: హైదరాబాద్ లోని జన్వాడ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ నిర్వహిస్తుండగా సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు దాడులు చేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే రేవ్ పార్టీలో పాల్గొన్న విజయ్ మద్దూరికి డ్రగ్స్ పాజిటివ్ గా తేలడంతో, పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఈ ఫామ్ హౌస్ యజమాని, మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలపై కూడా సెక్షన్ 34, ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు, ముమ్మర దర్యాప్తు సాగిస్తున్నారు.
ఈ కేసులో ఏ1 గా కార్తీక్, ఏ2 గా రాజ్ పాకాలపై కేసు నమోదు చేసిన పోలీసులు, వారి గృహాలలో సైతం తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ లో భారీగా విదేశీ మద్యాన్ని సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కాగా ఈ ఫామ్ హౌస్ ను సీజ్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అసలు ఎంత మంది పాల్గొన్నారు? ఎన్నేళ్ళుగా ఇక్కడ డ్రగ్స్ దందా సాగుతోందన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఈ రేవ్ పార్టీకి సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి, కాంగ్రెస్, బిజెపి విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. కేటీఆర్ బావమరిది ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ నిర్వహించడం పై, కేటీఆర్ ఇప్పుడేమంటారు అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం ఈ రేవ్ పార్టీ పై సమగ్ర విచారణ జరపాలని, సీసీ ఫుటేజ్ సహా ఆధారాలు ధ్వంసం కాకుండా చూడాలన్నారు. రేపు పార్టీలో పాల్గొన్న వాళ్లందర్నీ పోలీసులు గుర్తించి అరెస్ట్ చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఘటనపై పారదర్శకత పాటించాలని, లేకుంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య దోస్తీ ఉన్నట్లు భావించాల్సి వస్తుందన్నారు.
కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేయకమునుపే 20 మంది అక్కడ నుండి వెళ్లినట్లు తమకు సమాచారం ఉందన్నారు. అలాగే పోలీసులు ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని దర్యాప్తు సాగిస్తున్నారన్నారు. ఎవ్వరినీ వదిలే ప్రసక్తే లేదని, కారకులపై ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంటుందన్నారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. రేవ్ పార్టీలో పాల్గొన్న వారి పేర్లను బహిరంగ పరచాలని, డ్రగ్స్ తో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయో పోలీసులు ప్రకటన ద్వారా వెల్లడించాలన్నారు.
Also Read: జన్వాడ ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ.. పట్టుబడ్డ కీలక వ్యక్తులు
ఇలా కేటీఆర్ బావమరిదికి చెందిన ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ నిర్వహించడం, పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం, డ్రగ్స్ తీసుకున్నట్లు తేలడంతో ఈ కేసు ప్రతిష్టాత్మకంగా మారింది. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా గుర్తింపుకై కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంటే, మరోవైపు కేటీఆర్ కనుసన్నల్లో ఈ దందా సాగుతున్నట్లు తాము భావించాల్సి వస్తుందని కాంగ్రెస్ నాయకులు, కేటీఆర్ లక్ష్యంగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై కేటీఆర్ ఇప్పటివరకు స్పందించకపోవడం విశేషం.