మేడ్చల్ జిల్లా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 13న జరగనున్న ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. భద్రతా విషయంలో తీసుకోవాల్సిన చర్యలను అధికారులకు ఆయన సూచించారు. ఈ సమావేశంలో రాచకొండ సీపీ సుధీర్ బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కూకట్పల్లి వై జంక్షన్లో లేక్ షోర్ మాల్ను కో-ఫౌండర్, సీఈవో అశ్విన్ పూరి ప్రారంభించారు. 1.6 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ మాల్లో 250కి పైగా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు, 40 ఫుడ్ అవుట్లెట్స్, పీవీఆర్ సినిమా ఉన్నాయని, ఇది హైదరాబాద్లో ఒక ల్యాండ్మార్క్ అవుతుందని ఆయన పేర్కొన్నారు.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని చెర్లపల్లి, శంశీరెడ్డిపల్లి తండా, బస్వాపూర్ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి. ఆయా స్థానాలకు కేవలం ఒక్కొక్క నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో, ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు.
రంగారెడ్డి జిల్లా తాళ్లపల్లి గ్రామం మీదుగా వికారాబాద్ డిపో బస్సు వెళ్లకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బస్సును నిలిపివేశారు. ప్రైవేట్ లీజు బస్సుల కోసం అధికారులు కుమ్మక్కై బస్సులను దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. డిపో మేనేజర్ జోక్యంతో వివాదం సద్దుమణిగింది.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని మండల పరిషత్ బాలికల పాఠశాలలో తరగతి గది పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థినులపై పడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థినులకు స్వల్ప గాయాలయ్యాయి, పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
సంగారెడ్డి జిల్లా భీరంగూడలో ప్రేమిస్తున్నాడని యువకుడిని పిలిపించి హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. మృతుడు శ్రవణ్ సాయి మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించిన డాక్టర్ చంద్రశేఖర్, మధ్యాహ్నం 3 గంటలకు బాడీ రాగా, సాయంత్రం 5 గంటలకు పోస్ట్మార్టం ప్రారంభించినట్లు కీలక వివరాలు వెల్లడించారు.
అమరావతిలోని తాడేపల్లిలో ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ నూతన కార్యాలయాన్ని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రారంభించారు. రాష్ట్రంలో మహిళలు, బాలికల భద్రత కోసం శక్తి టీమ్స్ నిరంతరం పహరా కాస్తున్నాయని, నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు.
శ్రీ సత్యసాయి జిల్లా ఎంపీకుంట మండలం వంకమద్ధిలోని మండల పరిషత్ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. దీంతో విద్యార్థులు ఆరుబయటే చదువులు, మధ్యాహ్న భోజనం చేయాల్సి వస్తోంది. అధికారులు స్పందించి ప్రత్యామ్నాయం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం జనసేన పార్టీ కార్యాలయం మందు పార్టీలకు వేదికగా మారింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూర్యచంద్ర పార్టీ కార్యాలయంలోనే బహిరంగంగా మద్యం తాగుతూ, సిగరెట్లు కాలుస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాచవరం మండల ఎంపీపీ ఎన్నికల్లో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 15 మంది ఎంపీటీసీలు ఉన్న ఈ మండలంలో టీడీపీ ఆరుగురు సభ్యుల మద్దతుతోనే వ్యూహాత్మకంగా ఎంపీపీ పదవిని కైవసం చేసుకుంది.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని మాయాబజార్ హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. హోటల్లో అపరిశుభ్రత, గ్లౌజులు లేకుండా పనిచేయడం, ప్లాస్టిక్ వినియోగాన్ని గుర్తించిన కమిషనర్ రూ. 10 వేలు జరిమానా విధించారు.
నెల్లూరు చిన్నబజార్లోని సావన్ ఫ్యాన్సీ షాపుపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. అనుమతి లేని విదేశీ వస్తువులు, లేబుల్స్ మార్చి అధిక ధరలకు విక్రయించడం, డూప్లికేట్ సరుకును గుర్తించి సీజ్ చేశారు. బాధ్యులపై కేసు నమోదు చేస్తామని తెలిపారు.
కడప మున్సిపల్ కార్పొరేషన్ 4వ మేయర్గా పాకా సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కమిషనర్ మనోజ్ రెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ అవకాశం కల్పించిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి సురేశ్ కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా భావనపాడులో మాంతా తుఫాన్ బాధితుల కోసం తెచ్చిన ఉల్లిపాయలు, బంగాళాదుంపలు అధికారుల జాప్యంతో వృధా అయ్యాయి. పంపిణీ జరగకపోవడంతో నెలరోజుల తర్వాత అవి కుళ్లిపోయి వృధాగా మారాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
చిత్తూరు జిల్లా సోమల మండలంలో నాలుగు ఏనుగులు రైతుల పంటలపై దాడి చేశాయి. రామకృష్ణ అనే రైతుకు చెందిన కొబ్బరి, టమోటా, వరి పంటలను ధ్వంసం చేశాయి. ప్రస్తుతం ఏనుగులు బాలబాయి సమీపంలోని గుట్టలో తిష్ట వేశాయి.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పిన్నెల్లి సోదరులు లొంగిపోతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ రాజకీయ కక్షల కోసమే పనిచేస్తోందని, తమ నాయకులను అణిచివేసేందుకే కేసులు పెడుతున్నారని ఆయన విమర్శించారు.
న్యూ ఇయర్ నుంచి మెక్సికో, భారత్ దిగుమతులపై 50 శాతం సుంకం విధించనున్నారు. వాహనాలు, విడిభాగాలు, టెక్స్టైల్స్ వంటి వాటిపై ప్రభావం పడనుంది. దీనివల్ల ఉత్పత్తుల ధరలు, ముఖ్యంగా వాహనాల ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఓటరు జాబితా సవరణపై మాట్లాడుతూ, ఓట్లు తొలగిస్తే మహిళలు వంటగదిలో వాడే పరికరాలతో పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. తాను లౌకికవాదాన్నే నమ్ముతానని స్పష్టం చేశారు.
భారత మహిళల జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన క్రికెట్ కన్నా దేన్నీ ఎక్కువగా ప్రేమించనని తెలిపారు. ప్రపంచకప్ గెలవడం తమ ఎన్నో ఏళ్ల శ్రమ ఫలితమని, భారత జెర్సీ ధరించడం ఎప్పుడూ స్ఫూర్తినిస్తుందని ఆమె పేర్కొన్నారు.
ఏషియన్ ఓపెన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో నాలుగు పతకాలు సాధించిన నటి ప్రగతి, వాటిని మహిళా ఆర్టిస్టులకు అంకితం చేశారు. తన వయసు, జిమ్ దుస్తులపై ట్రోల్స్ చేసిన వారికి ఈ పతకాలతోనే సమాధానం చెప్పానని ఆమె పేర్కొన్నారు.