జనవరి 1 నుంచి 31 వరకు నిర్వహించనున్న జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
హైదరాబాద్లో న్యూ ఇయర్ వేడుకలపై సీపీ సజ్జనార్ కఠిన ఆంక్షలు విధించారు. ఈవెంట్లకు అర్ధరాత్రి 1 గంట వరకే అనుమతి ఉంటుందని, రాత్రి 7 నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే బార్లు, వైన్ షాపులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
మంచిర్యాల జిల్లా చెన్నూర్ పోలీస్ స్టేషన్ను జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన ఆయన, నేరాల నియంత్రణలో సిబ్బంది పనితీరును అభినందించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ద్రాక్షారామం భీమేశ్వర స్వామి దేవాలయంలో శివలింగం పైభాగం ధ్వంసమైన ఘటనపై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆలయాన్ని సందర్శించారు. ప్రభుత్వం, అధికారుల తీరుపై నిప్పులు చెరిగారు.
ద్రాక్షారామం భీమేశ్వరస్వామి ఆలయంలో శివలింగం ధ్వంసం కేసుపై జిల్లా ఎస్పీ స్పష్టతనిచ్చారు. నిందితుడు శీలం శ్రీనివాస్, అక్కడి పూజారిపై ఉన్న వ్యక్తిగత కక్షతోనే ఈ చర్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు.
అన్నమయ్య జిల్లా కలెక్టర్గా నిశాంత్ కుమార్ మదనపల్లె కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అధికారుల ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. నేటి నుంచి మదనపల్లె కేంద్రంగా జిల్లా పరిపాలన కార్యకలాపాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి.
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్యారేజీకి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం పంపిన నోటీసులకు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ స్పందించింది. పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సంస్థ ప్రకటించింది.
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా ఉర్సంగల్ అటవీ ప్రాంతంలో నక్సలైట్ల రహస్య డంప్ బయటపడింది. దీని నుంచి ఒక బోల్ట్ యాక్షన్ రైఫిల్, భార్మార్ గన్తో పాటు భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులపై కూంబింగ్ ఆపరేషన్లు కొనసాగుతాయని జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ అన్నారు.
వరంగల్ జిల్లాలోని బందనపల్లిలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. దీంతో బీజేపీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. దుండగులు ధ్వంసం చేసిన విగ్రహాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు రావు పద్మ, ప్రదీప్ రావు పరిశీలించారు. దోషులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలంటూ వారు హెచ్చరించారు.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. గత మూడు నెలలుగా వేతనాలు, 20 నెలలుగా పీఎఫ్ చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బకాయిలు చెల్లించే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
జగిత్యాల జిల్లా ధర్మారం సమీపంలోని ఓ పెట్రోల్ బంక్లో.. మద్యం, గంజాయి మత్తులో పోకిరీలు వీరంగం సృష్టించారు. అంతకుముందే పలువురితో గొడవపడి పెట్రోల్ బంక్కి చేరుకున్న యువకులు.. అక్కడికి వచ్చిన వరంగల్కు చెందిన విద్యార్థుల ముందే నానా హంగామా చేశారు. అటు బస్సు డ్రైవర్తో పాటు విద్యార్థులతో గొడవకు దిగారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వరుసగా ఆడ గర్భస్థ శిశువుల మృతదేహాలు లభ్యం కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. షాబునగర్ డ్రైనేజీ వద్ద తాజాగా 6 నెలల ఆడ శిశువు మృతదేహం దొరికింది. స్కానింగ్ సెంటర్లు, కొన్ని ఆసుపత్రుల అక్రమ నిర్వాకాలే కారణమని ప్రజలు మండిపడుతున్నారు.
విశాఖపట్నంలోని లాసన్స్ బే కాలనీలో న్యూ ఇయర్ వేళ డ్రగ్స్ దొరికాయి. బైక్పై గంజాయి, మత్తు పదార్థాలు తరలిస్తుండగా వినయ్, సాయి, శ్యామ్ అనే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వినయ్ బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చినట్లు గుర్తించిన పోలీసులు.. విచారణ చేపట్టారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు, ఎమ్మెల్యే జనార్ధన్, సినీ నటి అంజలి, హాస్యనటుడు శ్రీనివాస్రెడ్డి, దర్శకుడు మారుతిలు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నిర్వహించిన సమీక్షా సమావేశం వివాదాస్పదమైంది. సమావేశం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మంత్రి ఫోటో లేకపోవడంతో అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉక్రెయిన్లో బఫర్ జోన్ను పెంచాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశించినట్లు ఆ దేశ జనరల్ వాలేరి గెరసిమోవ్ వెల్లడించారు. ఇందులో భాగంగా సుమీ, ఖర్కీవ్ ప్రాంతాల్లోని గ్రామాలను ఆక్రమించుకుంటూ రష్యా దళాలు ముందుకు సాగుతున్నాయి. పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడికి ప్రయత్నించిన నేపథ్యంలో రష్యా ఈ నిర్ణయం తీసుకుంది.
దేశవ్యాప్తంగా డెలివరీ బాయ్స్, గిగ్ వర్కర్స్ సమ్మెకు దిగారు. తెలంగాణలోనూ కార్మికులు విధులను బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. తమకు కనీస హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా సరైన ఇన్సెంటివ్స్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నివారణకు తామే మధ్యవర్తిత్వం వహించామన్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ప్రకటనపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ పలు ప్రశ్నలు సంధించారు.
విజయ్ హజారే ట్రోఫీలో గోవాతో జరుగుతున్న మ్యాచులో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ విధ్వంసం సృష్టించారు. 75 బంతుల్లో 9 ఫోర్లు, 14 సిక్సర్లతో 157 రన్స్ చేశారు. ఉత్తరాఖండ్తో మ్యాచులో మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 124 రన్స్ చేశాడు.
ఎన్టీఆర్ ప్రైవసీ హక్కులకు భంగం కలగకుండా చూడాలని పలు వెబ్సైట్లు, ఆన్లైన్ వేదికలను దిల్లీ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జరిగే వరకూ కృత్రిమ మేధ, డీప్ ఫేక్లను వినియోగించకూడదని జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోడా ధర్మాసనం ఈనెల 22వ తేదీన ఆదేశాలు జారీ చేసింది.