World Justice Project : పాకిస్థాన్ లో శాంతి భద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయో వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ (WJP) నివేదిక కళ్లకు కట్టింది. పౌరుల రక్షణ, వారి హక్కులను కాపాడడం సహా.. అంతర్గత భద్రతా వంటివి ఏ దేశానికైనా ప్రధాన అంశాలు. వీటి అమలులో వెనుకబడితే… ఆయా దేశాల్లో అశాంతి రాజుకుంటుంది. ఈ అంశాల అమలులో ప్రపంచ దేశాల తీరుతెన్నులను అంచనా వేస్తూ వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ (WJP) అనే సంస్థ అంతర్జాతీయంగా ఓ నివేదికను తయారు చేసింది. అందులో… వివిధ అంశాలను ప్రతిపాదికలుగా తీసుకోగా… పాకిస్థాన్ అత్యంత చెత్త దేశంగా నిలిచింది. మొత్తం 142 దేశాలకు గానూ… పాక్ 140వ స్థానంలో నిలిచి అక్కడి దారుణ పరిస్థితులను ప్రపంచానికి చాటింది.
పాకిస్థాన్ తర్వాత అత్యంత పేదరికంలో మగ్గిపోతున్న పశ్చిమ ఆఫ్రికా దేశాలైన మాలి, నైజీరియాలు ఉన్నాయి. ఇక్కడ తినేందుకు తిండి లేని స్థితిలో ఆయా దేశాలు కొట్టుమిట్టాడుతుండగా… వాటి సరసన పాకిస్థాన్ నిలిచి… ప్రపంచ దేశాల్లో తనేంటో మరోసారి నిరూపించుకుంది. ప్రభుత్వ అధికారులపై ఒత్తిడులు, అవినీతి, పారదర్శక ప్రభుత్వ విధానాలు, ప్రాథమిక హక్కులు, శాంతి భద్రతలు, నేర నియంత్రణ వ్యవస్థలు, పౌర న్యాయం, నేర విచారణ తీరు.. ఇలా అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని అధ్యయనం చేయగా.. పాకిస్థాన్ లోని దుర్భర పరిస్థితులు బయటపడ్డాయి.
శాంతి భద్రతలు అనేవి ఆయా దేశాలలోని ప్రజల భద్రత, ప్రభుత్వాల తీరుతెన్నులకు అద్దం పడతాయి. అందుకే.. ఈ అంశాన్ని దేశంలో నేరాల నియంత్రణ, సాయుధ దాడుల నుంచి ప్రజలకు రక్షణ, పౌర ఆందోళనల్ని హింసాత్మక ధోరణిలో కట్టడి చేయడం వంటి అంశాల ఆధారంగా నిర్ణయిస్తారు. అంటే… క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు వాటి పై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో కూడా ఈ నివేదికలోని అంశాలు స్పష్టం చేస్తున్నాయి. వీటి ఆధారంగా చూస్తే… పాక్ లో ప్రజలు… అటు అస్థిర ప్రభుత్వ విధానాలకు, ఇటు పాలనలో పాక్ సైన్యం జోక్యం కారణంగా దినదిన గండంగా బతుకుతున్నట్లు తెలుస్తోంది.
చాలా కీలక అంశాల్ని లోతుగా అధ్యయనం చేసిన వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ నివేదిక… దేశంలో క్షీణించిన శాంతి భద్రతల గురించి మాత్రమే కాకుండా… ఆ దేశంలో అవినీతి ఏ స్థాయిలో ఉందో కూడా తెలుపుతోంది. ఇది మాత్రమే కాదు… ప్రభుత్వాల తీరు కారణగా పాలక పక్షాలపై ప్రజలు విశ్వాసాన్ని ఎప్పుడో కోల్పోయారన్న విషయాన్నీ వెల్లడిస్తోంది. పాకిస్థాన్ లో చట్టం, న్యాయస్థానాల కంటే ఉగ్రమూకలు, సైనిక బలగాల అధికారం ఎంతలా సాగుతుందో ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.
Also Read : చైనాతో దోస్తీ.. పాక్తో కుస్తీ.. దాయాదికి చెమటలు పట్టించే వ్యూహం, వర్కవుట్ అయ్యేనా?
పాకిస్థాన్ లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ అధికారాలపై ఆంక్షల అంశంలో 130వ ర్యాంకు, పారదర్శక ప్రభుత్వ పాలనలో 106వ స్థానం, పౌర హక్కుల రక్షణలో 125వ ర్యాంకు లభించాయి. వాటి కంటే దారుణంగా పౌరులకు న్యాయం అంధించడంలో అక్కడి వ్యవస్థలు ఎప్పుడో గాడి తప్పాయని, సామాన్యులకు న్యాయం అందడం చాలా కష్టమన్న ఈ నివేదిక… పౌర న్యాయంలో పాకిస్థాన్ కు 128వ ర్యాంకు కట్టబెట్టింది. ఇక.. దక్షిణాసియా దేశాల్లో పాకిస్థాన్ కు తోడుగా… మతోన్మాద తీవ్రవాదులైన తాలిబన్ల చేతిలోకి వెళ్లిపోయిన అఫ్ఘనిస్థాన్ సైతం దిగువ స్థాయిలో నిలిచింది.
కాగా… శాంతి భద్రతల పరిరక్షణలో డెన్మార్క్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా నార్వే, ఫిన్ ల్యాండ్, స్వీడన్, జర్మనీ లు నిలిచాయి.