Retirement plans : ఎవరైనా సరే.. పెట్టుబడి పెట్టే ముందు నెలకు ఎంత అవసరమో తేల్చుకోవాలి. ఉదాహరణకు ఈ రోజుల్లో నెలకు 50వేల ఖర్చు అవుతోందనుకుంటే.. వచ్చే ఐదేళ్లలో అది 60వేలు అవొచ్చు. 10, 15 ఏళ్లలో మరింత పెరగొచ్చు. సో, మనం కావాలనుకున్న ఆదాయం కూడా అంతే స్థాయిలో పెరుగుతూ ఉండాలి. పెట్టుబడి పెట్టే విధానం అంటే అదే. సో, భవిష్యత్ ఖర్చులను ఊహించి పెట్టుబడి పెట్టినప్పుడే సక్సెస్. ముఖ్యంగా రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న వాళ్లు, రిటైర్ అయిన వాళ్లు ఆలోచించాల్సిన పద్దతి ఇది.
అయితే.. సీనియర్ సిటిజన్స్ పెట్టుబడి విషయంలో దూకుడుగా వెళ్లొద్దు. ఫస్ట్ సేఫ్టీ ముఖ్యం. అదే సమయంలో మంచి రాబడి కూడా ముఖ్యమే. అందుకనే రిటైర్మెంట్ తీసుకున్న వారు ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని రాబడులను ఇచ్చే మార్గాలను చూసుకోవాలి. అందుకని రిటైర్మెంట్ తర్వాత కూడా ఈక్విటీల్లో పెట్టుబడులు కొనసాగించాలి.
ఈరోజుల్లో వేటి ధరలు ఎలా, ఎంత పెరుగుతాయో తెలీదు. అందుకే, ద్రవ్యోల్బణాన్ని మించి రాబడి రావాలంటే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాల్సిందే. అలాగని రిస్క్ తీసుకుని మొత్తం అమౌంట్ పెట్టొద్దు. పెట్టుబడిలో 30 నుంచి 40 శాతం సరిపోతుంది. మిగిలిన మొత్తాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్ వచ్చే వాటిలో పెట్టాలి. అంటే.. ప్రభుత్వం గ్యారెంటీగా ఉండే స్కీమ్స్లో అన్నమాట. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్స్కీమ్, ప్రధానమంత్రి వయవందన యోజన, పోస్టాఫీసు మంత్లీ ఇన్కమ్ పథకాలకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఇంకా అమౌంట్ మిగిలితే.. డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. మంచి కంపెనీలు, రేటింగ్ బాగుండే కంపెనీల్లో పెడితే.. మంచి వడ్డీ రేటు వస్తుంది.
ఎంత పెట్టుబడి పెడుతున్నాం, ఎంత రిటర్న్స్ వస్తోందన్నది మాత్రమే ఇంపార్టెంట్ కాదు. ఎంత డ్రా చేస్తున్నాం అన్నది కూడా ముఖ్యమే. ఏడాదికి 6 లక్షలకు మించి డబ్బు బయటకు తీయకూడదు అని ఓ టార్గెట్ పెట్టుకోవాలి. అప్పుడే రిటైర్మెంట్ అయిన వాళ్లకు మంచి రాబడి ఉంటుంది.