White Foods: ఆహారంలో రంగులు చాలా ముఖ్యం. కానీ.. కొన్ని రకాల ఆహార పదార్థాలు, ముఖ్యంగా తెల్లటి ఆహారాలు, మన ఆరోగ్యానికి అంత మంచివి కావు. అవి చూడడానికి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ.. వాటిలో పోషక విలువలు తక్కువగా ఉంటాయి. తెల్లటి పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరగడం, మధుమేహం, గుండె జబ్బుల వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మనం ఎక్కువగా తినే మూడు తెల్లటి ఆహార పదార్థాలు ఏవి ? వాటిని ఎందుకు తగ్గించాలో తెలుసుకుందామా..
1. తెల్ల బియ్యం (White Rice):
మనం తినే ఆహారంలో తెల్ల బియ్యం ప్రధాన ఆహారం. కానీ..వీటిని పాలిష్ చేయడం వల్ల అందులోని ముఖ్యమైన పోషకాలు, పీచు పదార్థాలు తగ్గి పోతాయి. తెల్ల బియ్యంలో కేవలం పిండి పదార్థాలు మాత్రమే ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. దీంతో ఇన్సులిన్ స్థాయిలు కూడా పెరుగుతాయి. ఇది దీర్ఘకాలంలో మధుమేహం బరువు పెరగడానికి దారితీస్తుంది. దీనికి బదులుగా.. పోషకాలు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే బ్రౌన్ రైస్, మిల్లెట్స్ (చిరుధాన్యాలు) వంటి వాటిని తీసుకోవడం మంచిది.
2. తెల్ల చక్కెర (White Sugar):
తెల్ల చక్కెరను ఎక్కువగా ప్రాసెస్ చేస్తారు. అందులో ఎటువంటి పోషకాలు ఉండవు. కేవలం కేలరీలు మాత్రమే ఉంటాయి. దీన్ని తరచుగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఇది శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి, ఊబకాయం, మధుమేహం రావడానికి ముఖ్య కారణం. అంతేకాకుండా.. తెల్ల చక్కెర గుండె జబ్బులు, దంతక్షయం , కొన్ని రకాల క్యాన్సర్లకు కూడా కారణమవుతుంది. ఆరోగ్యానికి దూరంగా ఉండాలంటే చక్కెర వినియోగాన్ని బాగా తగ్గించాలి. చక్కెర బదులు బెల్లం, తేనె లేదా స్టెవియా వంటి సహజసిద్ధమైన స్వీటెనర్స్ ను తక్కువ మోతాదులో వాడటం మంచిది.
Also Read: వర్షాకాలంలో జ్వరమా ? డెంగ్యూ కావొచ్చు !
3. తెల్ల పిండి (మైదా) (White Flour):
మైదా పిండిని గోధుమల నుంచి తయారు చేస్తారు. అయితే.. దీని తయారీలో గోధుమలోని పోషకాలను, పీచు పదార్థాన్ని తొలగిస్తారు. దీనివల్ల మైదాలో పోషక విలువలు చాలా తక్కువగా ఉంటాయి. మైదాతో చేసిన బ్రెడ్, బిస్కెట్లు, కేకులు, పరోటాలు, సమోసాలు వంటి ఆహార పదార్థాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇవి మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలకు కారణమవుతాయి. మైదాలో ఉండే అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగి, మధుమేహానికి దారితీస్తుంది. మైదాకు బదులుగా గోధుమ పిండి, రాగులు, జొన్నలు వంటి పిండిని వాడటం ఆరోగ్యానికి మంచివి. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు జరుగుతుంది. అంతే కాకుండా శరీరానికి అవసరం అయిన పోషకాలు కూడా లభిస్తాయి.
ఈ మూడు తెల్లటి ఆహార పదార్థాలను తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం ద్వారా మనం ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు. వాటికి బదులుగా సహజసిద్ధమైన, పోషకాలు నిండిన ఆహారాలను ఎంచుకోవడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుంది.