Corona Virus : కరోనా కాటేస్తోంది. వైరస్ చంపేస్తోంది. ఇన్నాళ్లూ ఏం కాదులే అని లైట్ తీసుకున్నాం. ఇప్పుడు చావు లెక్కలు చూస్తుంటే షాక్ అయ్యే పరిస్థితి. కేసులు వేలల్లో నమోదవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్క ప్రకారం ఇప్పటి వరకు దేశంలో 2,710 కేసులు నమోదయ్యాయి. గడిచిన నాలుగు రోజుల్లోనే కేసులు అమాంతం పెరిగాయి. శుక్రవారం ఒక్కరోజే 511 కొవిడ్ కేసులు ఫైల్ అయ్యాయని ప్రకటించింది ఆయుష్. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా దేశం మొత్తం మీద ఏడుగురు మరణించినట్టు వెల్లడించింది. అంటే ఇప్పటి వరకు మొత్తంగా 15 మంది చనిపోయారు. అందులో ఆరు మరణాలు మహారాష్ట్రలోనే ఉన్నాయి.
ఏపీలో 16 కేసులు..
ఏపీలో ఇప్పటి వరకు 16 కొవిడ్ పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది. ఏలూరు జిల్లా కేంద్రంలో ఒక్కసారిగా కరోనా పంజా విసిరింది. కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదికలో పని చేస్తున్న నలుగురు సిబ్బందికి కొవిడ్ పాజిటివ్ వచ్చింది. వెంటనే ఆ నలుగురిని హోమ్ ఐసోలేషన్లో ఉంచి చికిత్స చేస్తున్నారు. కలెక్టరేట్ స్టాఫ్ అందరికీ ఆర్టీ పీసీఆర్ టెస్టులు చేయిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఏలూరు, శాంతినగర్లో ఇద్దరు వృద్ధులకు కూడా కొవిడ్ పాజిటివ్ వచ్చింది. వారికి గుంటూరు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇలా వరుసబెట్టి కేసులు నమోదవుతుండటంతో.. కరోనా వైరస్ మరింతగా స్ప్రెడ్ అవుతోందా అనే అనుమానం కలుగుతోంది. అదే జరిగితే మళ్లీ మునుపటి మాదిరే సోషల్ డిస్టెన్స్, లాక్డౌన్ లాంటి చర్యలు తప్పవా అనే చర్చ నడుస్తోంది.
4 రోజుల్లో.. 2వేల కేసులు..
కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో వారం రోజులుగా కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మే 26 వరకు వెయ్యి కేసులు నమోదవగా.. మే 30 కల్లా కేసుల సంఖ్య 2,710 కి చేరడం కలవర పెడుతోంది. అంటే, నాలుగు రోజుల గ్యాప్లోనే సుమారు 2వేల కేసులు అంటే భయపడాల్సిందే అంటున్నారు.
ఏ స్టేట్లో ఎన్ని కేసులంటే..
కేరళలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,147కు చేరింది. ఆ తర్వాత అత్యధికంగా మహారాష్ట్రలో 424 కేసులు నమోదయ్యాయి. గుజరాత్లో 223, తమిళనాడులో 148, కర్ణాటకలో 148, పశ్చిమ బెంగాల్లో 116, రాజస్థాన్లో 51, ఏపీలో 16, తెలంగాణలో 3 కేసులు బయటపడ్డాయి. మిగిలిన రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మిజోరం, అస్సాంలో నలుగురు ఇన్ఫెక్షన్ బారిన పడినట్లు తెలుస్తోంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
కరోనా కొత్త వేరియంట్స్ గురించి భయపడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది కేంద్ర ఆరోగ్య శాఖ. పరిశుభ్రంగా ఉండటం, ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవడం, మాస్కులు ధరించడం, రోగనిరోధక శక్తి పెంచే ఆహారం తీసుకోవడం చేయాలని వెల్లడించింది. జలుబు, ముక్కు దిబ్బడ, అలసట, తలనొప్పి, గొంతు నొప్పి, జ్వరం లాంటి లక్షణాలు 5 రోజులకు మించి ఉంటే వెంటనే సమీపంలోని డాక్టర్ను కలవాలని తెలిపింది. కరోనా టెస్ట్ కిట్స్, వ్యాక్సిన్లు, హాస్పిటల్ బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్స్ అందుబాటులో ఉంచుకోవాలని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్రం.