Oats Face Pack: మొటిమల సమస్యతో ప్రస్తుతం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయంలోనే మొటిమలు తగ్గడానికి వివిధ రకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కూడా వాడుతుంటారు. అయినప్పటికీ ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని రకాల హోం రెమెడీస్ వాడటం చాలా ముఖ్యం.
మొటిమలు తగ్గడానికి మీకు ఓట్స్ కంటే మెరుగైన ఎంపిక మరొకటి ఉండదు. నిజానికి ఓట్స్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడుతుంది. అంతే కాకుండా మొటిమల వల్ల వచ్చే ఎరుపును కూడా తగ్గిస్తుంది. ఇది మొటిమల వల్ల కలిగే మచ్చలను కూడా మాయం చేస్తుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఓట్స్ తో ఫేస్ పాక్స్ ఎలా తయారు చేసుకుని వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఓట్ మీల్ ఫేస్ మాస్క్:
ఓట్స్తోఫేస్ మాస్క్ తయారు చేయడానికి ముందుగా రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ ను మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు దానికి ఒక టేబుల్ స్పూన్ పెరుగు, ఒక టేబుల్ స్పూన్ తేనె వేసి శుభ్రమైన ముఖం మీద అప్లై చేయండి. ఈ ఫేస్ ప్యాక్ ను ముఖానికి అప్లై చేసి 15 నుండి 20 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.
ఓట్ మీల్ స్క్రబ్:
ఓట్స్ స్క్రబ్ తయారు చేయడానికి ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల మెత్తగా రుబ్బిన ఓట్స్లో ఒక టేబుల్ స్పూన్ తేనె ,3 నుండి 4 చుక్కల ఆలివ్ నూనె వేసి బాగా కలపండి. ఇప్పుడు ఈ స్క్రబ్ని మీ తడి ముఖంపై అప్లై చేసి వృత్తాకారంగా 1-2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేయండి. ముఖం మీద కొంత సమయం అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.
ఓట్స్ , టీ ట్రీ ఆయిల్ మాస్క్:
మొటిమల మరకలను వదిలించుకోవడానికి ఒక టీస్పూన్ టీ ట్రీ ఆయిల్ను రెండు టేబుల్ స్పూన్ల మెత్తగా రుబ్బిన ఓట్స్తో కలిపి, దానికి కొద్దిగా నీరు కలపండి. తద్వారా అది పేస్ట్గా మారుతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని ముఖానికి అప్లై చేసి 10 నుండి 15 నిమిషాలు ముఖం మీద ఉండనివ్వండి. దీని తరువాత మీ ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడిగి శుభ్రం చేసుకోండి. దీన్ని వారానికి కనీసం మూడు సార్లు అప్లై చేయండి. ఇది మొటిమలతో పాటు మచ్చలను కూడా తొలగిస్తుంది.
Also Read: పూలతో ఫేస్ మాస్క్, ఇలా వాడితే.. తెల్లగా మెరిసిపోతారు !
ఓట్స్, పసుపుతో ఫేస్ మాస్క్:
ఓట్స్ తో పాటు పసుపు కూడా ముఖానికి చాలా మేలు చేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి రెండు టేబుల్ స్పూన్ల మెత్తగా రుబ్బిన ఓట్స్లో అర టీస్పూన్ పసుపు పొడి , కొన్ని చుక్కల రోజ్ వాటర్ కలిపి మందపాటి పేస్ట్ను తయారు చేయండి. ఈ పేస్ట్ను శుభ్రమైన ముఖానికి అప్లై చేసి 10 నుండి 15 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి. ఈ మాస్క్ వేసుకున్న తర్వాత మీరు తాజాగా ఉంటారు.
ఓట్స్, తేనెతో ఫేస్ మాస్క్:
ఓట్స్, తేనె మాస్క్ తయారు చేయడం చాలా సులభం. దీని కోసం మీరు చేయాల్సిందల్లా 2 టీస్పూన్ల మెత్తగా రుబ్బిన ఓట్స్ను.. తేనె , కొంచెం నీటితో కలిపి ఈ పేస్ట్ను ముఖానికి అప్లై చేసి 15 నుండి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా 2-3 సార్లు చేయడం వల్ల కూడా మొటిమలు తగ్గుతాయి.