Brain Eating Amoeba: ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఒకచోట.. ఏదో ఒక సమయంలో వింత వింత ఘటనలు చోటుచేసుకుంటూనే ఉంటాయి. వాటిలో కొన్ని మనల్ని ఆశ్చర్యానికి గురిచేసేవి అయితే.. మరికొన్ని భయాందోళనకు గురిచేస్తుంటాయి. అలాంటి ఓ భయంకరమైన సూక్ష్మజీవి గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. గతంలో ఆందోళన కలిగించిన ‘బ్రెయిన్ ఈటింగ్ అమీబా’ ఇప్పుడు మళ్లీ మనుషులపై దాడి చేసేందుకు సిద్ధమైంది.
మెదడును తినే అమీబాగా పిలిచే ఈ ‘నేగ్లేరియా ఫౌలరీ’.. పేరు వింటేనే చాలామంది భయంతో వణికిపోతుంటారు. ఎందుకంటే.. దీని ప్రభావం మనుషుల మీద అంత భయంకరంగా ఉంటుంది. తాజాగా సర్వే నిర్వహించిన నిపుణులు.. ఏం చెబుతుందంటే.. అమీబా సోకిన వారిలో దాదాపు 99 శాతం మంది ప్రాణాలు కోల్పోతున్నారు అని తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెదడును తినే ఈ అమీబా మనలోకి ఎలా ప్రవేశిస్తుంది? అసలు ఈ సూక్ష్మజీవి ఎక్కడి నుంచి పుడుతుంది.. అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మెదడును తినే ఈ సూక్ష్యజీవి పేరే అమీబా. ఇది సాధారణంగా వేడి నీటిలో.. ముఖ్యంగా సరస్సులు, చెరువులు, నదులు, అపరిశుభ్రమైన స్విమ్మింగ్ పూల్స్లో పురుడు పోసుకుంటుంది. ఎక్కువగా వేసవి కాలంలో నీటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఇది యాక్టివ్ అయిపోతుంది. అలాంటి మురికి నీటిలో మనం స్నానం చేయడం లేదా ఈత కొట్టేటప్పుడు.. ఈ మురికి నీరు ముక్కు ద్వారా శరీరంలోకి వెళ్లితే ఈ అమీబా మెదడుకు చేరుతుంది. అక్కడికి చేరిన తర్వాత మెదడు కణజాలాన్ని నాశనం చేస్తూ తీవ్రమైన ఇన్ఫెక్షన్కు దారితీస్తుంది.
ఈ వ్యాధిని వైద్య భాషలో ప్రైమరీ అమీబిక్ మెనింజోఎన్సెఫలైటిస్(PAM) అంటారు. ఈ సూక్మజీవి మన బ్రెయిన్లోకి చేరాక మొదట్లో తలనొప్పి, జ్వరం, వాంతులు, మెడనొప్పి లాంటి సాధారణ లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే పరిస్థితి తీవ్రంగా మారి, స్పృహ కోల్పోవడం, మూర్చ రావడం వంటి తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో చికిత్సకు స్పందించేలోపే ప్రాణాలు కూడా పోవచ్చని చెబుతున్నారు నిపుణులు.
మనందరం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఈ అమీబా కలుషిత నీటిని తాగడం వల్ల కాదు.. కేవలం ముక్కు ద్వారా నీరు లోపలికి వెళ్లినప్పుడే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే నిపుణులు కలుషిత నీటిలో ఈతకు వెళ్లడం వంటి పనులు చేయరాదని హెచ్చరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ముక్కును క్లీన్ చేసుకోవాలనుకుంటే.. మరిగించిన లేదా శుద్ధి చేసిన నీటిని మాత్రమే ఉపయోగించాలని సూచిస్తున్నారు. అయితే.. భయపడకుండా సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రాణాంతక అమీబా నుంచి మనల్ని మనమే కాపాడుకోవచ్చు.
గతంలో కేరళ రాష్ట్రంలో నమోదైన పలు అంతుచిక్కని మరణాలకు మెదడును తినే ఈ అమీబానే కారణం అంటూ పరిశోధకులు గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా వాతావరణంలో జరిగే మార్పులే అమీబా బారిన పడేలా చేస్తాయట. తాజాగా చైనాలోని సన్ యట్సేన్ యూనివర్సిటీ పరిశోధకుడు లాంగ్ఫీ షూ తెలిపిన వివరాల ప్రకారం.. భూతాపం పెరగడం వల్ల ఈ అమీబాలు గతంలో లేని కొత్త ప్రాంతాలకు కూడా చేరుకుంటున్నాయట. ఈ సూక్ష్మజీవులు ఎక్కువ వేడి, క్లోరిన్ వంటి క్రిమిసంహారకాలను కూడా తట్టుకుని తమ మనుగడను సాగించగలవని చెబుతున్నారు.