Health Benefits: సాధారణంగా కొంతమంది నిద్రలేవగానే బ్రష్ చేసేస్తుంటారు. మరికొంతమంది కాఫీ లేదా టీ తాగాక బ్రష్ చేస్తుంటారు. మరీ బద్ధకస్తులు అయితే.. బ్రష్ తర్వాత చేయొచ్చులే అని టిఫినీలు కూడా కానిచ్చేస్తుంటారు. కానీ, ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు రావచ్చని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే.. రాత్రిపూట లాలాజలం ఉత్పత్తి తగ్గిపోవడంతో నోటిలో బ్యాక్టీరియా పెరుగుతుంది. ఆ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే ఆమ్లాలు మీ దంతాల ఎనామెల్ను దెబ్బతీస్తాయి. అందుకే ఉదయం లేచిన వెంటనే బ్రష్ చేయడం వల్ల ఆ హానికరమైన బ్యాక్టీరియా, ఆమ్లాలు తొలగిపోతాయి. ఇది కేవలం నోటి పరిశుభ్రతకే కాకుండా.. దీర్ఘకాలిక ఆరోగ్యానికి కూడా రక్షణ కల్పిస్తుందని చెబుతున్నారు వైద్య నిపుణులు.
రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు బ్రష్ చేయడం దంతాల ఆరోగ్యానికి ఎంతో అవసరం. 8 గంటలపాటు నోరు మూసుకుపోయి ఉండే సమయంలో ఆహార కణాలపై బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. పైగా నిద్రపోయే సమయంలో లాలాజలం తక్కువగా ఉండటం వల్ల ఈ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఫలితంగా కుహరం, చిగుళ్ల వ్యాధులు, నోటి దుర్వాసన వంటి సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి.. రాత్రి పడుకునే ముందు బ్రష్ చేయడం మర్చిపోవద్దు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read Also: భరించలేని తలనొప్పి క్షణాల్లో మాయం.. ఐస్ వాటర్లో దాగున్న అద్భుత రహస్యమిదే!
2020లో డయాబెటోలాజియా అనే పత్రికలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. నోటి పరిశుభ్రతకు మధుమేహంతో సంబంధం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. రోజుకు మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు పళ్లు తోముకునే వ్యక్తులకు మధుమేహం వచ్చే ప్రమాదం 8% తక్కువగా ఉన్నట్లు తేలింది. అదే దంత వ్యాధులు ఉన్నవారిలో ఈ ప్రమాదం 9% ఎక్కువ. 15 లేదా అంతకంటే ఎక్కువ దంతాలు కోల్పోయినవారిలో ఇది 21% వరకు పెరుగుతుంది. అంటే.. ప్రతిరోజూ రెండు కంటు ఎక్కువసార్లు బ్రష్ చేసే అలవాటు కేవలం పళ్ల రక్షణకే కాదు.. డయాబెటిస్ వంటి వ్యాధుల నుంచి రక్షణకూ సహాయపడుతుంది.
అమెరికన్ డెంటల్ అసోసియేషన్ సిఫార్సు ప్రకారం.. రోజుకు రెండుసార్లు కనీసం 2 నిమిషాలపాటు ఫ్లోరైడ్ టూత్పేస్ట్తో బ్రష్ చేయాలి. ఇది బ్యాక్టీరియా పొర ఏర్పడకుండా అడ్డుకుంటుంది. బ్యాక్టీరియా పొర దంత క్షయం, చిగుళ్ల వ్యాధికి ప్రధాన కారణం అవుతుంది. అలాగే నేషనల్ హెల్త్ సర్వీస్ సిఫార్సు ప్రకారం.. మీడియం లేదా సాఫ్ట్ బ్రిస్టిల్స్ ఉన్న టూత్బ్రష్ను ఉపయోగించడం ఉత్తమం. ప్రతిరోజూ ఉదయం నిద్రలేచాక, రాత్రి పడుకునే ముందు సరైన విధంగా పళ్లు తోముకోవడం ద్వారా ఆరోగ్యకరమైన చిరునవ్వు మాత్రమే కాదు.. గుండె, మధుమేహం, చిగుళ్ల వ్యాధుల నుంచి కూడా రక్షణ పొందవచ్చు.
Read Also: తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయా?.. ఈ విషయంలో సైన్స్ ఏం చెబుతోందంటే!