COVID-19 in India: యావత్ ప్రపంచాన్ని భయపెట్టిన కరోనా ఇప్పుడు కొన్ని దేశాల్లో మళ్లీ ఎఫెక్ట్ చూపించడం మొదలు పెట్టింది. ముఖ్యంగా హాంకాంగ్, సింగపూర్, థాయ్లాండ్తో పాటు చైనాలోనూ కొవిడ్-19 వ్యాప్తి విపరీతంగా ఉంది. వారానికి వేల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. సింగపూర్ లో ఏప్రిల్ చివరి వారంలో 14వేల కరోనా కేసులు నమోదయ్యాయి. రోజూ 100 మంది దాకా బాధితులు హాస్పిటల్స్ లో చేరుతున్నారని, అయితే ఐసీయూ అడ్మిట్స్ చాలా తక్కువగా ఉన్నాయంటున్నారు.
దేశరాజధాని ఢిల్లీలో విజృంభిస్తున్న కరోనా
అటు థాయ్లాండ్లోనూ వారానికి వేల సంఖ్యలో కొవిడ్ కేసులు వస్తున్నాయి. మే రెండో వారంలోనే 33వేల కేసులు రికార్డయినట్లు అంచనా. ఒమిక్రాన్ క్లాస్ కు చెందిన XEC వేరియంట్ వల్లే కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అటు హాంకాంగ్లోనూ కొవిడ్ వ్యాప్తి విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం ఆసియా దేశాల్లో కోవిడ్ వ్యాప్తికి కారణంగా భావిస్తున్న జేఎన్.1 రకం వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమేనని, ఆందోళన కలిగించే రకం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదివరకే స్పష్టం చేసింది. దేశరాజధాని ఢిల్లీలో కూడా కరోనా విజృంభిస్తోంది. ఒక్కరోజే సుమారు 23 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఢిల్లీ వైద్య ఆరోగ్యశాఖ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.
కరోనా కేసులపై ఏపీ అలర్ట్
మరోవైపు కరోనా కేసులపై ఏపీ అలర్ట్ అయింది. విశాఖపట్నంలో కొవిడ్ కేసు నమోదవడంతో అప్రమత్తమయ్యారు. నగరంలోని మద్దిలపాలెంకు చెందిన 23 ఏళ్ల యువతి కార్పొరేట్ హాస్పిటల్ లో 4 రోజుల కిందట జ్వరంతో చేరినప్పుడు.. అనుమానంతో కరోనా నిర్ధారణ పరీక్ష చేయగా పాజిటివ్ అని తేలింది. ఇదే నమూనాను విశాఖ కేజీహెచ్లోని వైరాలజీ ల్యాబ్లోనూ పరీక్షించి కరోనా పాజిటివ్ అని నిర్ధారించారు. ఆరోగ్యం నిలకడగా ఉండడంతో ఆమెను నిన్ననే డిశ్చార్జ్ చేశారు. అటు కడప రిమ్స్ లోనూ కరోనా కలకలం చెలరేగింది. దగ్గు, జలుబు, జ్వరంతో ఓ మహిళ హాస్పిటల్ రాగా.. ఆమెకు కరోనా ఉందని ప్రచారం జరిగింది. మహిళను ముందు జాగ్రత్తగా కోవిడ్ వార్డులో అడ్మిట్ చేసి టెస్టులు చేశారు. అయితే ఆమెకు కరోనా లక్షణాలు లేవని కడప రిమ్స్ డాక్టర్లు ప్రకటించారు. కరోనా ఎఫెక్ట్ పెరుగుతుండడంతో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ సూచనలు చేసింది. జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి లక్షణాలు కనిపిస్తే ఇంట్లో విడిగా ఉండాలని, మాస్కులు వాడాలని, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు.
గాంధీ హాస్పిటల్ లో 30 పడకలతో కోవిడ్ వార్డు ఏర్పాటు
అటు తెలంగాణలోనూ వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. మరోసారి వేగంగా వ్యాపిస్తున్న కరోనాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు అంటున్నారు. రాష్ట్ర నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ లో 30 పడకలతో కోవిడ్ వార్డును ఏర్పాటు చేశారు. కరోనాను సమర్థంగా ఎదుర్కొనేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. థర్డ్వేవ్లో వచ్చిన ఒమిక్రాన్ సబ్ వేరియంట్ జేఎన్– 1 ప్రస్తుతం వ్యాప్తిలో ఉందని, కానీ.. ఇది ప్రమాదకారి కాదంటున్నారు. దీర్ఘకాల వ్యాధులతో బాధపడేవారు, వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు అలర్ట్ గా ఉండాలంటున్నారు డాక్టర్లు.
కరోనాపై హై అలర్ట్ ప్రకటించింది కేరళ
కరోనాపై హై అలర్ట్ ప్రకటించింది కేరళ. ఈ నెలలోనే అక్కడ 182 కేసులు నమోదయ్యాయి. జనం అంతా అప్రమత్తంగా ఉండాలంటూ ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ప్రకటించటం కలకలం రేపుతోంది. ఎవరికైనా దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ఇతర అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే మాస్క్ పెట్టుకోవాలంటున్నారు. కరోనాలోని ఒమిక్రాన్ JN1, LF7, NB1.8 రకం వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోందంటున్నారు. అటు కర్ణాటకలోనూ 16 కరోనా కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో 10, జిల్లాల్లో ఆరు కేసులను గుర్తించామని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటించారు.