హైదరాబాదులో మిగిలిపోయిన మాంసం కూరని ఫ్రిజ్ లో పెట్టి తిరిగి వేడి చేసుకుని తిన్న కుటుంబం ఆసుపత్రి పాలైంది. ఆ కుటుంబంలో ఉన్న తొమ్మిది మంది కూడా రిఫ్రిజిరేటర్లో ఉంచిన మిగిలిపోయిన మాంసాహారాన్ని తిన్నారు. అది తిన్న వెంటనే ముగ్గురు పరిస్థితి విషమంగా మారిపోయింది. అలాగే ఒక వ్యక్తి మరణించారు. ఆదివారం వండిన మాంసాహారాన్ని ఫ్రిజ్లో పెట్టుకొని సోమవారం కూడా మళ్లీ వేడి చేసుకొని తినడంతో వారికి ఫుడ్ పాయిజనింగ్ అయినట్టు వైద్యులు భావిస్తున్నారు.
కూర తిన్నవెంటనే ఏం జరిగింది?
ఆ కూర తిన్న వెంటనే వారికి వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపించాయి. అవి తీవ్రంగా మారడంతో కుటుంబంలోని 9 మంది చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. అందులో ఒక వ్యక్తి మంగళవారమే మరణించారు. మరొక ముగ్గురి పరిస్థితి విషమంగా మారింది. మిగిలినవారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ప్రాథమిక దర్యాప్తులో ఫుడ్ పాయిజనింగ్ దీనికి కారణం అని తేలింది. నిల్వచేసిన మాంసాహారాన్ని మళ్లీ వేడి చేసుకుని తినడం వల్లే ఇలా జరిగినట్టు వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వారు తిన్న వాటిలో బోటీ కూర, కోడికూర ఉన్నట్టు వైద్యులు వివరించారు.
ఇలా తింటే ఎందుకు డేంజర్?
నిల్వ ఉంచిన మాంసాహారాన్ని మళ్లీ వేడి చేసుకొని తినడం అనేది ఎంతో అనారోగ్యకరమైనది. దాంతో అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆ మాంసం త్వరగా బ్యాక్టీరియా, వైరస్లు, పరాన్న జీవులతో కలుషితం అయిపోతుంది. దీనివల్ల ఫుడ్ పాయిజనింగ్ ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. ఎక్కువ కాలం నిల్వ ఉంచిన మాంసంలో హానికరమైన టాక్సిన్లు ఏర్పడతాయి. అలాంటి ఆహారాన్ని తింటే అనారోగ్య సమస్యలు తీవ్రంగా వస్తాయి.
ఫ్రిజ్ లో నిల్వ ఉంచిన మాంసాహారాన్ని తిరిగి వేడి చేసుకొని తినడం వల్ల సాల్మొనెల్లా, E.కోలి వంటి బ్యాక్టీరియాలు శరీరంలో చేరే అవకాశం ఉంది. వీటివల్ల తీవ్రమైన ఫుడ్ పాయిజన్ జరుగుతుంది. నిల్వ ఉంచిన మాంసం ఇతర కలుషితాల వల్ల కూడా విషపూరితమైన టాక్సిన్లతో నిండిపోతుంది. ఇలా నిల్వ ఉంచిన మాంసంలో పోషక విలువలు కూడా ఏమీ ఉండవు. కాబట్టి ఆ మాంసాన్ని తిన్నా కూడా ఆరోగ్యానికి హానికరమే.
చాలామంది ముందు రోజు వండిన మాంసాహారం మిగిలిపోతే దాన్ని ఫ్రిజ్ లో ఉంచి నాలుగు రోజులైనా కూడా వేడి చేసుకుని మళ్లీ తింటూ ఉంటారు. అలా తిన్న వెంటనే విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పి, జ్వరం వంటివి కనిపిస్తే మీకు తీవ్రమైన ఫుడ్ పాయిజన్ జరిగిందని అర్థం. ఒక్కోసారి పరిస్థితి చేయి దాటిపోతుంది. తీవ్రమైన ఇన్ఫెక్షన్లు వంటివి మరణానికి దారితీస్తాయి. ముఖ్యంగా పిల్లలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, వృద్ధులు వంటి వారు వీటిని తట్టుకోలేరు. కాబట్టి నిల్వ ఉంచిన మాంసం తినడానికి ప్రయత్నించకండి. ఎప్పటికప్పుడు తాజా మాంసం వండుకొని తినడమే మంచిది.
చాలాచోట్ల షవర్మా తిని ఫుడ్ పాయిజనింగ్ అయిన కేసులను కూడా చూసాము. షవర్మా తిన్న తర్వాత ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. మాంసాహారానికి తీవ్రమైన వైరస్లు, బ్యాక్టీరియా వంటివి చేరుతాయి. ఇవి ప్రాణాంతకంగా మారుతాయి. కాబట్టి మా నిల్వ ఉంచిన మాంసాహారాన్ని తినే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి ఆహారాన్ని తినక పోవడమే ఉత్తమం.