రాగి పాత్రల్లో నిల్వ చేసిన నీరు తాగితే శరీరానికి మంచిదని చాలామంది చెబుతుంటారు. ఇప్పుడు వెండి వంతు వచ్చింది. మనం నీరు తాగే పాత్రల్లో వెండి నాణెం ఉంచితే దానివల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని తాజాగా కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అయితే ఇందులో నిజమెంత అనేది వైద్యులే నిర్థారించాలి.
పూర్వం రాజులు బంగారు, వెండి పళ్లాళ్లో భోజనం చేసేవారు. సామాన్యులు మట్టి పాత్రలు వాడేవారు. లోహపు పాత్రలు వాడటం వల్ల కొద్ది స్థాయిలో అవి ఆహార పదార్థాలతో కరిగి శరీరంలోకి వెళ్తాయని, శరీరానికి మేలు చేస్తాయని అంటారు. అందుకే మంచినీరు తాగడానికి కూడా లోహపు పాత్రలను వాడుతుంటారు. కానీ రాను రాను ప్లాస్టిక్ యుగం ప్రారంభమైన తర్వాత, తినడానికి, తాగడానికి అన్నిటికీ ప్లాస్టిక్ లేదా ఫైబర్ వస్తువుల్ని వాడుతున్నాం. వీటివల్ల అనారోగ్యం వస్తుందనే విషయం కూడా మనకు తెలుసు. కానీ తప్పడం లేదు.
కాపర్ ప్లస్ వాటర్ ప్యూరిఫయర్లు..
ఇప్పుడిప్పుడే ప్రజల్లో కాస్త అవగాహన పెరుగుతోంది. ప్లాస్టిక్, ఫైబర్ వస్తువుల స్థానంలో లోహాలను లేదా గాజు పాత్రలను వాడటం మొదలు పెడుతున్నారు. ముఖ్యంగా మంచినీటి విషయంలో రాగి పాత్రల వాడకం జోరందుకుంది. వాటర్ ప్యూరిఫైయర్ల విషయంలో కూడా రాగిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కాపర్ ప్లస్ వాటర్ ప్యూరిఫైయర్లకు ఇప్పుడు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు కొత్తగా సిల్వర్ వాటర్ అనే ట్రెండ్ మొదలైంది.
?utm_source=ig_web_copy_link
నీటి కుండలో వెండి నాణెం..
వెండిలోహంతో కలసిన నీటిని ప్రతిరోజు తీసుకుంటే శరీరం మలినాలను త్వరగా విసర్జించగలుగుతుందని, డిటాక్స్ అవుతుందనే ప్రచారం మొదలైంది. కొంతమంది ఫిట్ నెస్ కోచ్ లు ఈ ప్రచారం మొదలు పెట్టారు. తేజల్ పరేఖ్ అనే సర్టిఫైడ్ ఫిట్ నెస్ కోచ్ తాను మంచినీటిని నిల్వ చేసుకునే కుండలో ఒక వెండి నాణెంను ఉంచుతానని, రోజూ వాటినే తాగుతానని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. ఆయన్ను చూసి చాలామంది అదే ఫాలో అవుతున్నారు. వెండిలో సహజ యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయని, నీటిలోని బ్యాక్టీరియాని వెండి క్లీన్ చేస్తుందని, ఆ నీటిని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు పరేఖ్. ముఖ్యంగా ఇది చిన్న పిల్లలకు మరింత మేలు చేకూరుస్తుందని చెప్పారు. వెండి కలిసిన నీటిని తాగితే జీర్ణ వ్యవస్థ కూడా మెరుగవుతుందని, పెద్ద పేగు ఆరోగ్యంగా ఉంటుందని, నీటి ద్వారా సంక్రమించే వ్యాధులకు చెక్ పెట్ట వచ్చని అంటున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
– ఒకవేళ మీరు సిల్వర్ వాటర్ ని ట్రై చేయాలంటే.. 99శాతం స్వచ్ఛమైన వెండి నాణెంను మీరు నీరు తాగే పాత్రల్లో ఉంచాలి.
– సిల్వర్ కాయిన్ ని రెగ్యులర్ గా క్లీన్ చేస్తుండాలి. క్లీనింగ్ కోసం నిమ్మకాయ, బేకింగ్ సోడాను ఉపయోగించాలి.
– వెండి నాణెం నీటిని ఫిల్టర్ చేయదు. అందుకే ఫిల్టర్ చేసిన నీటిలో అదనంగా మాత్రమే వెండి నాణెం వేయాలి.
నాణేనికి మరోవైపు..
అయితే తాగునీరులో వెండి నాణెం ఉంచడం అనేది శాస్త్రీయంగా ఇంకా రుజువు చేయబడలేదు. కొంతమంది లైఫ్ కోచ్ లు ఈ ప్రయోగాన్ని అస్సలు చేయొద్దని సలహా ఇస్తున్నారు. వెండి కలసిన నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది అని రుజువు కాలేదని, అందుకే పిల్లల ఆరోగ్యంతో చెలగాటం ఆడొద్దని, ఎలాంటి ప్రయోగాలు చేయొద్దని సలహా ఇస్తున్నారు.