ముఖానికి పలుచటి పొరలాంటిది అతికించుకొని కాసేపటి తర్వాత దాన్ని తీసి పడేస్తే ముఖంపై ఉన్న మురికి, టాన్ మొత్తం పోతుంది. ఇలాంటి ఫేస్ పీల్స్ రెడీమేడ్ గా మార్కెట్లో ఎన్నో దొరుకుతున్నాయి. వీటికన్నా ఇంట్లోనే సహజమైన పద్ధతిలో ఫేస్ పీల్స్ తయారు చేసుకోవచ్చు. ఇవి ముఖాన్ని మెరిపించడంతోపాటు మృత కణాలను తొలగిస్తాయి. ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి.
కీరా దోసతో ఫేస్ ఫీల్
కీరాదోసను సౌందర్య ఉత్పత్తిగా వాడుతారు. కీరాదోసను తీసుకొని మిక్సీలో వేసి మెత్తగా గుజ్జులా చేయండి. దీన్ని చిన్న గిన్నెలో వేయండి. అందులోనే గుడ్డులోని తెల్లసొనను కూడా వేసి బాగా కలపండి. అందులో ఒక స్పూను నిమ్మరసం కూడా వేసి కలపండి. ఈ మొత్తం మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల పాటు అలా వదిలేయండి. తర్వాత తీస్తే అది పొరలు పొరలుగా రాలిపోతుంది. లేదా గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకున్నా చాలు కీరాదోస మొటిమల సమస్యను తగ్గించడంతో పాటు ముడతలు, గీతలు వంటివి రాకుండా అడ్డుకుంటుంది.
పైనాపిల్.. బొప్పాయితో..
పైనాపిల్, బొప్పాయి ముక్కలతో కూడా ఫేస్ పీల్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు ఒక పైనాపిల్ ముక్కను, బొప్పాయి ముక్కను తీసుకోవాలి. ఈ రెండింటినీ మెత్తని పేస్టులా చేసి ఒక గిన్నెలో వేయాలి. అందులోని అర చెంచా తేనె కూడా వేసి బాగా కలపాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని ముఖానికి మాస్కులా వేసుకోవాలి. ఒక అరగంట పాటు అలా వదిలేయాలి. తర్వాత దాన్ని చేతితోనే తొలగించేందుకు ప్రయత్నించాలి. లేదా గోరువెచ్చని నీటితో కడిగితే సులువుగా పోతుంది. ఈ ఫేస్ మాస్కులను తరచూ వేసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది.
ఓట్స్ తో
ఓట్స్ ముఖానికి చేసే మేలు ఎంతో. ఓట్స్ ను పాలల్లో వేసి బాగా నానబెట్టాలి. అవి నానాక మెత్తగా పేస్టులాగా చేసుకోవాలి. అందులోనే పెరుగు, తేనె వేసి బాగా కలపాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట పాటు వదిలేయాలి. ముఖ్యంగా బ్లాక్ హెడ్స్ ఉన్నచోట ఈ మిశ్రమాన్ని పట్టిస్తే అవి త్వరగా తొలగిపోతాయి. అరగంట తర్వాత చేతితోనే తొలగించేందుకు ప్రయత్నించాలి. గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఈ ఓట్స్ తో వేసే ఈ మాస్క్ క్లెన్సర్ లాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ముఖం శుభ్రపడుతుంది.
Also Read: మీ చర్మం మెరిసిపోవాలని కోరుకుంటున్నారా? అయితే వీటిని తినడం తగ్గించండి
అవకాడో పండ్లతో
అవకాడో పండు ఖరీదైనది. కానీ దీంతో వేసే ఫేస్ మాస్క్ అద్భుతంగా పనిచేస్తుంది. అవకాడో పండు నుంచి రెండు స్పూన్ల గుజ్జును వేరు చేయండి. దాన్ని ఒక చిన్న గిన్నెలో వేయండి. అందులోనే రెండు చెంచాల తేనె, కోడిగుడ్డులను తెల్లసొన కూడా వేసి బాగా కలపండి. ఈ మొత్తం మిశ్రమాన్ని ముఖానికి పట్టించండి. అరగంట పాటు అలా వదిలేయండి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుని పొడి వస్త్రంతో తుడుచుకోండి. చర్మం మెరిసిపోయేలా కనిపిస్తుంది. మీకు ఫేస్ పీల్స్ వేసుకున్న తర్వాత బయటికి వెళ్లాల్సి వస్తే సన్ స్క్రీన్ లోషన్ వాడడం మర్చిపోవద్దు.