Body Heat Raising Foods: సమ్మర్లో ఎండలు తట్టుకోవాలంటే మనం తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సాధారణంగా కూరగాయలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని భావిస్తాం, కానీ కొన్ని కూరగాయలు శరీరంలో ఉష్ణోగ్రతను పెంచి, డీహైడ్రేషన్ , అసౌకర్యానికి గురిచేస్తాయి. ముఖ్యంగా హీట్వేవ్ (వడగాల్పులు) సమయంలో శరీరానికి చలవ చేసే ఆహారం అవసరం. ఈ నేపథ్యంలో.. వేసవిలో శరీర వేడిని పెంచే ఆరు కూరగాయల గురించి , వాటిని ఎందుకు పరిమితంగా తీసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.
సాధారణంగా ఎండాకాలం రాగానే మనం నీళ్లు ఎక్కువగా తాగుతుంటాం, మజ్జిగ, కొబ్బరి నీళ్ల వంటివి కూడా తీసుకుంటాం. కానీ కూరగాయల విషయానికి వచ్చే సరికి ఏది తింటే వేడి చేస్తుందో చాలా మందికి తెలియదు. ఆయుర్వేదం ప్రకారం.. కొన్ని కూరగాయలు “ఉష్ణ” స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇవి జీర్ణ ప్రక్రియలో ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తాయి. తద్వారా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది.
వేసవిలో మితంగా తీసుకోవాల్సిన ఆ 6 కూరగాయలు ఇవే..
1.అల్లం :
అల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. జలుబు, దగ్గు తగ్గించడంలో దీనికి సాటి లేదు. కానీ వేసవిలో అల్లం అతిగా తీసుకోవడం వల్ల శరీరంలో విపరీతమైన వేడి పుడుతుంది. అల్లం రక్త ప్రసరణను వేగవంతం చేస్తుంది. అంతే కాకుండా థర్మోజెనిసిస్ (శరీరంలో వేడి పుట్టించే ప్రక్రియ)ను ప్రేరేపిస్తుంది. హీట్వేవ్ సమయంలో.. అల్లం టీ లేదా కూరల్లో ఎక్కువ అల్లం వాడటం వల్ల గుండెల్లో మంట, ముక్కు నుండి రక్తం కారడం వంటి సమస్యలు రావచ్చు.
2.వెల్లుల్లి :
వెల్లుల్లిలో యాంటీ బయోటిక్ గుణాలు ఉన్నప్పటికీ.. ఇది అత్యంత వేడిని కలిగించే పదార్థం. వెల్లుల్లిలో ఉండే ‘అల్లిసిన్’ అనే సమ్మేళనం శరీర మెటబాలిజాన్ని పెంచి చెమట పట్టేలా చేస్తుంది. ఎండా కాలంలో వెల్లుల్లి ఎక్కువగా వాడటం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరగడమే కాకుండా, నోటి దుర్వాసన , చర్మంపై దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది.
3.పచ్చిమిర్చి :
కారం శరీరంలో వేడిని పెంచుతుందని అందరికీ తెలిసిందే. పచ్చిమిర్చిలో ఉండే ‘క్యాప్సైసిన్’ మన శరీరంలోని ఉష్ణోగ్రత గ్రాహకాలను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల శరీరం త్వరగా వేడెక్కుతుంది. వేసవిలో మసాలాలు, పచ్చిమిర్చి కారం అధికంగా ఉండే.. కూరలు తింటే కడుపులో మంట, అజీర్తి సమస్యలు తలెత్తుతాయి.
4.ఉల్లిపాయలు (ముఖ్యంగా ఎర్ర ఉల్లిపాయలు):
ఉల్లిపాయలు చలవ చేస్తాయని కొందరు అంటారు. కానీ అది పచ్చి ఉల్లిపాయల విషయంలో మాత్రమే.. కొంతవరకు నిజం. అయితే.. ఉల్లిపాయలను వేయించి లేదా మసాలాతో కలిపి వండినప్పుడు అవి శరీరంలో వేడిని పెంచుతాయి. ముఖ్యంగా ఎర్రటి ఉల్లిపాయలు పిత్త దోషాన్ని పెంచుతాయని ఆయుర్వేదం చెబుతోంది. వేసవిలో వీటి వాడకం పరిమితంగా ఉండటం మంచిది.
5.దుంప జాతి కూరగాయలు :
క్యారెట్లు, ముల్లంగి , బంగాళదుంపలు భూమి లోపల పెరుగుతాయి. ఇవి సాంద్రత ఎక్కువగా ఉండే కూరగాయలు. వీటిని జీర్ణం చేయడానికి శరీరం ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది. ముల్లంగి ప్రత్యేకించి వేడి స్వభావాన్ని కలిగి ఉంటుంది. వేసవిలో ముల్లంగిని అతిగా తీసుకుంటే.. శరీరంలో వేడి పెరిగి యూరిన్ లో మంట కలిగే అవకాశం ఉంది.
Also Read: ఒత్తైన, మెరిసే జుట్టు మీ సొంతం కావాలా ?
6.ఆకుకూరల్లో కొన్ని రకాలు :
పాలకూర, మెంతికూర వంటివి పోషక విలువల పరంగా అద్భుతమైనవి. కానీ మెంతికూర సహజంగానే వేడిని కలిగిస్తుంది. వేసవిలో మెంతికూర పప్పు లేదా కూర ఎక్కువగా తింటే శరీరంలో వేడి పెరుగుతుంది. పాలకూరలో ఐరన్ , ఆక్సలేట్లు ఎక్కువగా ఉండటం వల్ల వేసవిలో దీనిని మితంగా తీసుకోవడమే బెస్ట్.
జాగ్రత్తలు:
పైన పేర్కొన్న కూరగాయలను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు, కానీ హీట్వేవ్ సమయంలో వాటి పరిమాణాన్ని తగ్గించుకోవడం చాలా ముఖ్యం. వీటికి బదులుగా నీటి శాతం ఎక్కువగా ఉండే కూరగాయలను ఎంచుకోవాలి:
1.పొట్లకాయ, సొరకాయ, బీరకాయ వంటివి శరీరానికి చలవ చేస్తాయి.
2.కీరా దోసకాయ, పుచ్చకాయలను ఎక్కువగా తీసుకోవాలి.
3.పెరుగు, మజ్జిగ వంటి పదార్థాలను డైట్లో చేర్చుకోవాలి.
ఈ వేసవిలో మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా మీరు వడదెబ్బ నుంచి రక్షించుకోవడమే కాకుండా.. రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు.