ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. మీరు ఏ దేశానికి వెళ్లినా కూడా స్కూల్ బస్సులు పసుపు రంగులోనే కనిపిస్తాయి. వేరే రంగులో ఒక్క స్కూల్ బస్సు కూడా కనిపించదు. అంతర్జాతీయంగా పసుపు రంగును స్కూల్ బస్సులకే అంకితం చేశారు. ఇలా పసుపురంగుని స్కూల్ బస్సులకు ఎందుకు వేస్తారు? వేరే రంగు ఎందుకు వేయరు? అనే సందేహం ఎక్కువమందిలోనే వస్తుంది. స్కూల్ బస్సులకు పసుపు రంగునే ఎంపిక చేయడానికి కారణం ఉంది. స్కూల్ బస్సులకు వేసే రంగును హైవే ఎల్లో అని పిలుస్తారు. ఈ రంగు ఎంతో ప్రత్యేకమైనది. స్కూల్ బస్సులన్నీ కూడా ఇదే రంగులో ఉంటాయి. పసుపులో ఎన్నో షేడ్స్ ఉన్నా కూడా హైవే ఎల్లోనే స్కూల్ బస్సులకు వేస్తారు. కేవలం స్కూల్ బస్సులే కాదు కాలేజీ బస్సులు కూడా ఇవే రంగులో ఉంటాయి.
ప్రతి రంగుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. దాని సొంత ప్రత్యేక గుణాన్ని లక్షణాలను కలిగి ఉంటాయి. ఒక్కో రంగును చూసినప్పుడు మనలో ఒక్కొక్క ఫీలింగ్ కలుగుతుంది. కేవలం స్కూలు బస్సులే కాదు కొన్ని రకాల ఆటోలు కూడా పసుపు రంగులోనే ఉంటాయి. దీనికి కూడా కారణం ఉంది. ఆ కారణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
పసుపు రంగు వేయడానికి కారణం
VIBGYOR అని పిలిచే రంగుల సమ్మేళనం గురించి మీకు తెలుసు. ఇది ఊదా రంగు, ఇండిగో, నీలం, ఆకుపచ్చ, పసుపు, నారింజ, ఎరుపు రంగుల మిశ్రమంగా ఏర్పడింది. ఈ రంగులే ప్రపంచంలో ప్రధానమైనవి. ఈ రంగులలో ఎరుపు అత్యంత ముఖ్యమైనది. ఇది పొడవైన తరంగధైర్యాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఎరుపు ఎక్కువ దూరం నుంచి చూడగలిగే రంగు. అందుకే ప్రమాద సంకేతాలకు ట్రాఫిక్ లైట్లు ఎరుపు రంగును ఉపయోగిస్తారు. ఇక రెండవది పసుపు. ఇది కూడా ఎరుపుతో పోలిస్తే తక్కువ తరంగధైర్ఘాన్నే కలిగి ఉన్నా… ఇతర రంగులతో పోలిస్తే ఎక్కువ తరంగధైర్యాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా దూరం నుంచి చూసే అవకాశం ఎక్కువ. కాబట్టి పాఠశాల బస్సుల్లో పిల్లలే ఉంటారు. పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. అందుకే ఈ రంగును పాఠశాల బస్సులకు వినియోగిస్తారు.
రహదారులపై స్కూల్ బస్సులు వస్తున్నప్పుడు చాలా దూరం నుంచి ఈ రంగును కనిపెట్టవచ్చు. వర్షం పడుతున్న పొగ మంచు ఉన్నా కూడా ఈ పసుపు రంగు దూరం నుంచే కనిపిస్తుంది. మన కళ్ళు ఈ పసుపు రంగును త్వరగా గుర్తిస్తాయి. మన కళ్ళు చాలా సులువుగా గుర్తించే రంగు ఎరుపు. దూరం నుంచి కూడా ఎరుపుని ఇట్టే పసిగట్టేస్తాము. ఎరుపును ప్రమాదకర సంకేతాలను ఇచ్చేందుకు వాడడం ప్రపంచమంతా మొదలైంది. అందుకే పసుపు రంగును స్కూల్ బస్సులకు అందించారు. దూరం నుంచే స్కూల్ బస్సులు వస్తున్న సంగతిని గుర్తించవచ్చు. బస్సుల్లో ఉన్న పిల్లలను, యువతను కాపాడుకోవచ్చు.
కేవలం స్కూల్ బస్సులే కాదు, రోడ్డు నిర్మాణానికి ఇళ్ల నిర్మాణానికి ఉపయోగించే క్రేన్లు, బుల్డోజర్లకు కూడా పసుపు రంగుని వేస్తారు. అవి కదులుతున్న విషయం సులువుగా మన కళ్ళు గుర్తిస్తాయి. లేకుంటే కదులుతున్న వస్తువులను ఆలస్యంగా గుర్తిస్తే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా పాఠశాల బస్సులకు కేవలం పసుపు రంగే వేయాలని అంతర్జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకున్నారు. అందుకే ప్రపంచమంతా కూడా స్కూలు బస్సులు, పసుపు రంగులోనే కనిపిస్తాయి.