Karate Kalyani: ఇటీవల కరాటే కళ్యాణి బయటపెట్టిన ఒక ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. టీటీడీ లక్కీ డ్రా పేరుతో కొందరు యువకులు ప్రజలను మోసం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ మోసాన్ని అడ్డుకునే ప్రయత్నంలో ఆమెపై దాడి జరగడం ఇప్పుడు సంచలనంగా మారింది. అది కూడా పోలీసులు ఉండే ఇలా జరగడం మరి ఎక్కువగా ఆశ్చర్యపరుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు..ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
కరాటే కళ్యాణి తెలిపిన వివరాల ప్రకారం..తిరుమల శ్రీవారి సన్నిధిని సాక్షిగా చేసుకుని కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు లక్కీ డ్రా పేరుతో ప్రచారం చేస్తున్నారు. కేవలం రూ.399 చెల్లిస్తే ఫార్చ్యూనర్ కారు, ఐఫోన్, టీవీ, బైక్ వంటి ఖరీదైన బహుమతులు వస్తాయని నమ్మించి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ ప్రచారం పూర్తిగా మోసపూరితమని, భక్తుల విశ్వాసంతో ఆడుకుంటున్నారని తెలిపారు.
ఈ విషయాన్ని గమనించిన కళ్యాణి, ఆ యువకులను ప్రశ్నించి, పంజాగుట్ట పోలీసులకు అప్పగించేందుకు ప్రయత్నించారు. అయితే వారు తప్పు చేసినట్లు ఒప్పుకోకపోవడమే కాకుండా.. ఆమెను బూతులు తిడుతూ దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం. పరిస్థితి ఉద్రిక్తంగా మారి, ఆదిపట్ల వందర్ల ప్రాంతంలో కళ్యాణిపై దాడికి కూడా ప్రయత్నించినట్లు చెబుతున్నారు. అదృష్టవశాత్తూ, స్థానికుల సహకారంతో ఆమెకు పెద్ద ప్రమాదం తప్పింది.
ఇప్పటికే వాళ్ళు చేసిన మోసంపై.. ఆమె పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తిరుమల ప్రాంగణాన్ని ఉపయోగించి ఇలాంటి మోసాలు చేయడం తీవ్ర నేరమని పోలీసులు స్పష్టం చేశారు. అవసరమైతే మరిన్ని సెక్షన్లు కూడా జోడిస్తామని తెలిపారు.
ఈ వ్యవహారంలో తిరుమల తిరుపతి దేవస్థానం పేరు దుర్వినియోగం కావడం భక్తుల్లో ఆగ్రహాన్ని రేపుతోంది. అధికారికంగా టీటీడీకి ఈ లక్కీ డ్రాతో ఎలాంటి సంబంధం లేదని పలువురు స్పష్టం చేస్తున్నారు. ప్రజలు ఇలాంటి ఆకర్షణీయ ప్రకటనలను నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
దీంతో లక్కీ డ్రా ముసుగులో జరుగుతున్న మోసాలను బయటపెట్టేందుకు ముందుకు వచ్చిన కరాటే కళ్యాణి ధైర్యాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారి, ప్రజల్లో అవగాహన పెరగడానికి కారణమవుతోంది.
ALSO READ: Jana Nayagan: జన నాయగన్ సెన్సార్ కోతల పై విచారణ..సర్టిఫికెట్ లేకుండా విడుదల తేదీ ప్రకటించడం ఏంటీ?