Venu Balagam: బలగం సినిమాతో దర్శకుడిగా గొప్ప విజయాన్ని అందుకున్న నటుడు వేణు, తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. వేణు దాదాపు 200 పైగా సినిమాల్లో నటించారు. అయితే, ఆయన మంచి పాత్రలు చేసిన సినిమాలు కమర్షియల్గా ఆశించిన విజయం సాధించలేకపోయేవి. దీనివల్ల ఇండస్ట్రీలో ఆయనపై “ఐరన్ లెగ్” అనే ముద్ర పడింది. “వేణు కాలు పెడితే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది” అని అప్పట్లో తెగ ప్రచారం జరిగేదని ఆయన వాపోయారు.
Read also-Rashmika Mandanna : బాలీవుడ్ లో గోల్డెన్ ఆఫర్.. సైన్స్ ఫిక్షన్ మూవీలో రష్మిక..?
బలగం వేణుకు రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్, పూరి జగన్నాథ్ వంటి అగ్ర దర్శకులతో మంచి పరిచయాలు ఉన్నప్పటికీ, ఈ ‘సెంటిమెంట్’ భయం వల్ల చాలా మంది ఆయనకు వేషాలు ఇవ్వడానికి వెనుకాడేవారు. తనకు తెలిసిన వారు కూడా ఆ సెంటిమెంట్కు భయపడి అవకాశాలు ఇవ్వకపోవడం చాలా బాధ కలిగించిందని ఆయన చెప్పుకొచ్చారు. తనతో పాటు ఇండస్ట్రీలోకి వచ్చిన వారు స్టార్స్గా ఎదుగుతుంటే, తనకు మాత్రం టాలెంట్ ఉండి కూడా ఒక కమర్షియల్ హిట్ లేకపోవడం వల్ల వెనకబడిపోతున్నాననే ఆవేదన ఉండేది. ఇది చాలా పెయిన్ఫుల్ జర్నీ అని ఆయన గుర్తు చేసుకున్నారు.
తాను ‘బలగం’ సినిమా తీసినప్పుడు, కథకు తగ్గట్టుగా పాత్రలను ఎంపిక చేసుకోవాల్సి వచ్చిందని, తన స్నేహితులకు కూడా కొన్నిసార్లు అవకాశాలు ఇవ్వలేకపోయానని ఆయన తెలిపారు. ఆ సమయంలోనే గతంలో తనకు అవకాశాలు ఇవ్వని దర్శకుల పరిస్థితి ఏంటో తనకు అర్థమైందని, అందుకే వారందరికీ మనసులోనే క్షమాపణలు చెప్పుకున్నానని వేణు వివరించారు. మొత్తానికి, ఎన్నో అవమానాలు ‘ఐరన్ లెగ్’ అనే విమర్శలను ఎదుర్కొన్న వేణు, ‘బలగం’ సినిమాతో తనలోని అసలైన ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పారు. తాజాగా సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ తో ఎల్లమ్మను ప్రారంభించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.