Komatireddy Rajagopal Reddy: స్వేఛ్చ బ్యూరో: కాంగ్రెస్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ వివాదానికి తెర లేపారు. ఏకంగా సీఎం పై విమర్శనాస్త్రాలు కురిపించారు. తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని, లేకుంటే సీఎం పోస్టు కోసం ప్రయత్నిస్తానని రెండు రోజుల క్రితం చెప్పిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తాజాగా సీఎం పై పర్సనల్ గా విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టారు. పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని సీఎం చేసిన వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి ఘాటుగా స్పందించారు. సీఎం చేసిన వ్యాఖ్య అధిష్టానాన్ని అవమానించడమే అంటూ ఆయన మండిపడ్డారు. సీఎం ఒక్కరే కష్టపడితే కాంగ్రెస్ అధికారంలోకి రాలేదని, పార్టీలో నేతలంతా శ్రమించారని ఆయన గుర్తు చేశారు.ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో చర్చంశనీయమయ్యాయి. గతంలోనూ ఓ సారి సీఎం పై విమర్శలు వర్షం కురిపించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చాలా రోజుల తర్వాత మళ్లీ ఫైర్ అయ్యారు. ఇదంతా మంత్రి పదవి కోసమేనంటూ కొందరు నేతలు చెప్తుండగా, ఆయనకు హామీ ఇచ్చి ఇవ్వకపోవడం తప్పేనని మరి కొంత మంది గాంధీభవన్ లోని లీడర్లు చెప్తున్నారు.
సీఎం గట్టి ఫైట్ చేస్తే, సొంత జిల్లా మహబూబ్ నగర్ లో, సిట్టింగ్ ఎంపీ మల్కాజ్ గిరిలో పార్టీ ఎందుకు ఓడిపోయింది? అంటూ రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. దీంతో ఆదిలాబాద్, కరీంనగర్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు వెనకబడిందని తప్పుపట్టారు. ఇక మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీలో కాంగ్రెస్ ఎందుకు గెలవలేకపోయిందన్నారు. దీంతో పాటు రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీకి డిపాజిట్లు ఎందుకు రాలేదు? అంటూ రాజగోపాల్ రెడ్డి ఘటుగా ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే కార్యకర్తల కష్టమేనంటూ రాజగోపాల్ రెడ్డి తేల్చి చెప్పారు. అందరూ కష్టపడితే రేవంత్ రెడ్డికి అదృష్టం కలిసి వచ్చి సీఎం అయ్యారని రాజగోపాల్ రెడ్డి వివరించారు.
Also Read: Fake Notes: కారేపల్లిలో దొంగనోట్ల కలకలం.. రూ.50 కోట్లకు పైగా అక్రమ వ్యాపారం
వాస్తవానికి పార్టీ అంతర్గత విషయాలను బయటకు పొక్కకుండా ఇంటర్నల్ గా చర్చించుకోవాలని ఏఐసీసీ ఇన్ చార్జ్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు రిక్వెస్ట్ చేశారు. కానీ కాంగ్రెస్ లో స్వేచ్ఛ ఎక్కువ అంటూనే ఇంట్లో విషయాలను రోడ్డుపైకి తెస్తున్నట్లు కొందరు లీడర్ల వ్యవహరిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి కూడా ఇదే తరహాలో వ్యవహరిస్తున్నారనే డిస్కషన్ కూడా పార్టీలో చర్చకు వస్తున్నది. డిసిప్లినరీ కమిటీ కూడా వీటిని పరిశీలిస్తూనే , మౌనంగా వ్యవహరిస్తుందనే చర్చ కూడా జరుగుతున్నది. రాజగోపాల్ రెడ్డి విమర్శలపై సీఎం ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం.
రాజగోపాల్ రెడ్డి ఈ దఫా తన వ్యాఖ్యలకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. రాజగోపాల్ రెడ్డి త్వరలో తన ఫాలోవర్లు, మద్దతుదారులతో భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవి ఇవ్వకపోతే , తన రాజకీయ భవిష్యత్తు పార్టీలో తన ప్రాధాన్యతపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఆయన అడుగులు వేయనున్నారనే ప్రచారం కూడా ఉన్నది. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్త పర్యటనకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.ఇదిలా ఉండగా, సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి తిరుగుబావుటా ఎగురవేయడం కాంగ్రెస్ హైకమాండ్కు తలనొప్పిగా మారింది.