Bobby Deol: ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. విలక్షణ నటుడిగా తనకంటూ పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న ఈయన.. ఈ మధ్యకాలంలో తెలుగులో కూడా సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల చిత్రాలలో విలన్ పాత్రలతో అదరగొట్టేస్తున్న ఈయన.. ఇప్పటికే బాలకృష్ణ , పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల సినిమాలలో విలన్ పాత్ర పోషించి మెప్పించిన విషయం తెలిసిందే. అలాంటి ఈయన తాజాగా ఇచ్చిన ఒక స్టేట్మెంట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన మాట్లాడుతూ.. తనతో పని చేసిన వాళ్లందరూ కూడా మంత్రులయ్యారు అంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం జన నాయగన్. దాదాపు 7 నెలల పాటు సుదీర్ఘ వాయిదాల తర్వాత ఎట్టకేలకు నేడు థియేటర్లలోకి వచ్చింది. అయితే ఈ సినిమా విడుదల సందర్భంగా ప్రముఖ నటుడు బాబీ డియోల్ ఒక ఇంటర్వ్యూలో సరదాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా ఆయన మాట్లాడుతూ.. “విజయ్ కి ఎక్కువగా ప్రచారం చేసుకోవడం నచ్చదు. ఇక నాది కూడా అదే స్వభావమే.. కాకపోతే నాతో కలిసి పని చేసిన వాళ్లంతా కూడా మంత్రులయ్యారు. నేను బాలకృష్ణ తో కలిసి డాకు మహారాజ్ సినిమాలో నటించాను. ఆయన చాలా కాలంగానే రాజకీయాల్లో ఉన్నారు. కానీ గత ఎన్నికల్లో మళ్ళీ విజయం సాధించి హ్యాట్రిక్ అందుకున్నారు.
హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించాను. ఇక ఆయన మంత్రి మాత్రమే కాదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి ఉపముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఇక ఇప్పుడు విజయ్ తో కలిసి జననాయగన్ సినిమాలో నటించాను. ఆయన ఏకంగా ఒక రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయ్యారు అంటూ చమత్కరించారు. ఇకపోతే ఈయన సూర్యతో కలిసి నటించిన కంగువా సినిమా మంచి విజయాన్ని అందుకోకపోయినా ఆయనతో కలిసి పనిచేయడం ఒక అనుభవంగా మిగిలింది అంటూ గుర్తు చేసుకున్నారు. ఇక మొత్తానికైతే బాబీ డియోల్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అన్ని మాటలు మాట్లాడిన బాబీ డియోల్ చివర్లో తాను ఇదంతా కేవలం సరదాగా చేసిన వ్యాఖ్యలే అంటూ తెలిపారు.
ALSO READ:1000 ఇంజెక్షన్లు.. 5సార్లు ఐవీఎఫ్.. నరకం అనుభవించానంటున్న ప్రముఖ నటి!
బాబి డియోల్ విషయానికి వస్తే.. దివంగత నటుడు ధర్మేంద్ర చిన్న కుమారుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయన.. ధరమ్ వీర్ అనే చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను పలకరించారు. 1995లో బర్సాత్ అనే చిత్రంలో హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పైగా ఈ చిత్రానికి ఉత్తమ పురుష తొలి అరంగేట్రం విభాగంలో ఫిలింఫేర్ అవార్డు లభించింది. ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమాతో మంచి కమర్షియల్ విజయాన్ని అందుకున్న ఈయన అప్పటినుంచి విలన్ పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.