Raja Singh: స్వేచ్ఛ బ్యూరో: గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ సిజేపీ ఆందోళనలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విద్యారంగంలో లోపాలు, సమస్యలు ఉంటే వాటిపై నిరసన తెలపడంలో ఎలాంటి తప్పులేదని, కానీ విద్యార్థుల పేరును ఒక సాకుగా వాడుకుంటూ అసలు ఉద్దేశాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు.
జంతర్ మంతర్ నిరసనలపై ప్రశ్నల వర్షం
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనల తీరుపై రాజా సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా సమస్యల పేరుతో అక్కడ ఉగ్రవాద అనుకూల నినాదాలు ఎందుకు ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు. హిందూ ధర్మాన్ని, సీతారాములను ఎందుకు దూషిస్తున్నారో చెప్పాలని నిలదీశారు.
ప్రధాని నరేంద్ర మోడీపై దాడికి కుట్ర..?
ఈ నిరసనల్లో ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ అంశాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీపై దాడికి కుట్ర పన్నుతూ, బ్రాహ్మణులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారని ఆరోపించారు. అసలు ఈ ధర్నాలు విద్యార్థుల భవిష్యత్తు కోసమా లేక హిందువులను లక్ష్యంగా చేసుకుని చేస్తున్నారా అని సందేహం వ్యక్తం చేశారు. అక్కడే అల్లా గురించిన పాటలు పాడుతూ, పోలీసులు , ఆర్మీ సిబ్బందిపై కూడా దాడులకు తెగబడ్డారని ఫైర్ అయ్యారు.
తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డిపై విమర్శలు
ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును కూడా రాజా సింగ్ తప్పుపట్టారు. రాష్ట్రంలో నిరుద్యోగులు, రైతులు, మహిళలు అనేక కష్టాలు పడుతున్నారని, ప్రజలు తీవ్ర బాధల్లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. తెలంగాణలో అసలు విద్యా వ్యవస్థ సరిగ్గా ఉందా అని నిలదీశారు.
పాలనను గాలికి వదిలేసి తెలంగాణను సర్వనాశనం చేశారని తీవ్రంగా విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా రాజకీయ నాటకాలు మాని, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించాలని హితవు పలికారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పిన మాటలకు డ్యాన్స్ చేయడం మానుకోవాలని రాజా సింగ్ చురకలు అంటించారు.
Also Read: సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్.. పలాసలో రోడ్డెక్కిన వైసీపీ శ్రేణులు!