Chiranjeevi Health: తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడు, మెగాస్టార్ చిరంజీవి ఆరోగ్యంపై సామాజిక మాధ్యమాలలో తప్పుడు ప్రచారం చేసిన ఒక యూట్యూబ్ ఛానల్పై హైదరాబాద్లోని జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కేవలం వ్యూస్, లైకుల కోసం సెలబ్రిటీల ఆరోగ్యంపై నిజా నిజాలు లేని వార్తలను అల్లేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న యూట్యూబ్ నిర్వాహకులపై పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు.
Read also-హైడ్రోజన్ రైలుకు పచ్చజెండా ఊపిన రైల్వే బోర్డ్.. ఎక్కడి నుంచి ఎక్కడికంటే?
గత కొన్ని రోజులుగా ఒక నిర్దిష్ట యూట్యూబ్ ఛానల్ చిరంజీవి ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిందని, ఆయన ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారంటూ కొన్ని తప్పుడు వీడియోలను అప్లోడ్ చేసింది. క్లిక్బైట్ థంబ్నైల్స్, మార్ఫింగ్ చేసిన చిత్రాలతో కూడిన ఈ వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. ఇది గమనించిన చిరంజీవి అభిమానులు, మెగా అభిమాన సంఘాల ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకపక్క చిరంజీవి పూర్తి ఆరోగ్యంతో తన సినిమా షూటింగులలో ఎంతో చురుగ్గా పాల్గొంటుంటే, కేవలం డబ్బుల కోసం ఇలాంటి తప్పుడు వార్తలు వండటంపై అభిమానులు మండిపడ్డారు. ఈ క్రమంలోనే అఖిల భారత చిరంజీవి యువత ప్రతినిధులు జుబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. అభిమానుల ఫిర్యాదును స్వీకరించిన జుబ్లీహిల్స్ పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం సదరు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అద్భుతమైన ఆరోగ్యంతో, ఎనర్జీతో ఉన్నారు. ఆయన తన తదుపరి చిత్రం ‘మెగా 158’ షూటింగ్లో ఎంతో బిజీగా గడుపుతున్నారు. సామాజిక మాధ్యమాలలో వస్తున్న ఇలాంటి రూమర్స్ ఎవరూ నమ్మవద్దని, అభిమానులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని చిత్ర యూనిట్ సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి. కేవలం పాపులారిటీ, వ్యూస్ కోసం ప్రముఖ వ్యక్తుల వ్యక్తిగత జీవితాలు, ఆరోగ్యంపై అసత్య ప్రచారాలు చేస్తే ఐటీ చట్టాల ప్రకారం కఠినమైన జైలు శిక్ష, జరిమానా తప్పవని పోలీసులు హెచ్చరించారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే ఇలాంటి ఛానల్స్ను పూర్తిగా బ్యాన్ చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.