Water Conservation: గ్లోబల్ వార్మింగ్ కారణంగా వాతావరణంలో తరుచూ చోటుచేసుకుంటున్న మార్పులతో నీటి పరిరక్షణ, పొదుపుపై జలమండలి దృష్టి సారించింది. వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు ప్రతి ఇంటి ఆవరణలో వర్షపు నీరు ఇనికేందుకు ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలని జలమండలి ఎన్నో ప్రయత్నాలు చేసినా, ఆశించిన ఫలితాలు రాకపోవటంతో కఠిన చర్యలకు సిద్దమైంది. ముఖ్యంగా ఎండలు మండిపోతుండటం, ఇప్పటి వరకు చినుకు వర్షం పడకపోవటంతో మున్ముందు నీటి డిమాండ్ పెరిగే అవకాశముంది. ఇప్పటికే భూగర్భజలాలు అడుగంటి పోయిన నాలుగైదు ప్రాంతాల్లో జలమండలి నీటి ట్యాంకర్లకు డిమాండ్ గణనీయంగా పెరగటంతో గతంలో ఎన్నడూ లేని విధంగా జలమండలి వాటర్ ఫిల్లింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసిన బుక్ చేసుకున్న 24 గంటల్లోనే వాటర్ ట్యాంకర్లను డెలివరీ చేస్తుంది.
24 గంటల్లోపు వాటర్ ట్యాంకర్ డెలివరీ కాని పక్షంలో ఫిర్యాదులు వస్తే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకునేందుకు కూడా సిద్దమైంది. గత వేసవి కాలంలో ఇదే తరహాలో ఎండల మండిపోయినా, మే మాసంలో అడపాదడపా వర్షాలు కురిశాయి. కానీ ఈ సారి ఇప్పటి వరకు మండుతున్న ఎండలకు తోడు వర్షం కురుస్తుందని జలమండలి భావించిన ఫలితం దక్కలేదు. శాశ్వత నీటి సమస్యకు ఇంకుడు గుంతలే పరిష్కారంగా గుర్తించిన జలమండలి ఇప్పటి వరకు ఆప్షన్ గా ఉన్న హార్వెస్టింగ్ పిట్ లను ఇకపై మస్టు చేసే యోచనలో ఉంది. వాటర్ హర్వెస్టింగ్ పిట్ లు లేని ఇళ్లు ట్యాంకర్ బుక్ చేస్తే డబుల్ ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్దమైంది. ఈ విషయమై మంగళవారం జిల్లా ఇన్ ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం జలమండలి సమీక్షానంతరం మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో స్పష్టం చేశారు. ఈ చిట్ చాట్ లో మంత్రి అజారుద్దిన్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read: Hyderabad Weather: ఆకాశం ముసిరేసింది.. హైదరాబాద్ సిటీ ముసుగేసింది, ముందస్తు రుతుపవనాలు
2014 నుంచి 2023 వరకు గడిచిన పదేళ్లలో పట్టణీకరణ పెరుగుతున్న హైదరాబాద్ భవిష్యత్తు నీటి అవసరాలపై ఎలాంటి ముందస్తు ప్రణాళికలు గాని ప్రయత్నాలు గానీ జరగలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. గత పదేళ్లలో కనీసం ఒక్క ఎంజీడీ (మిలియన్ గ్యాలన్స్ పర్ డే) అదనపు నీటి కోసం కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయలేదన్నారు. ప్రస్తుతం నగరంలో ఉన్న కృష్ణా, గోదావరి, సింగూరు, మంజీరా, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వంటి అన్ని వనరుల ద్వారా దాదాపు 650 ఎంజీడీల నీటి సామర్థ్యం ఉండగా, ప్రస్తుతం 550 ఎంజీడీల నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తు అవసరాలను గుర్తించి, ఇటీవల ముఖ్యమంత్రి చేతుల మీదుగా రూ. 7 వేల కోట్ల వ్యయంతో 300 ఎంజీడీల సామర్థ్యం గల ‘గోదావరి ఫేజ్-2’ ప్రాజెక్టుకు గండిపేటలో శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, హైదరాబాద్ నగర భవిష్యత్తు అవసరాలకు గడిచిన 40 నుంచి 50 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వాలే కృష్ణా, గోదావరి, సింగూరు, మంజీరా జలాలను తీసుకొచ్చాయని గుర్తు చేశారు.
తాజాగా కృష్ణా ఫేజ్-4, ఫేజ్-5 ప్రాజెక్టులను కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని ప్రజల దాహార్తిని తీర్చుతున్న జలమండలి కి ఇప్పటి వరకు వివిధ ప్రాజెక్టులకు దాదాపు రూ. 11,900 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. నాటి సింగూరు, మంజీరా పైప్లైన్ల మార్పిడి ప్రక్రియను కూడా ప్రారంభించామని, దీని ద్వారా నీటి వృధా తగ్గి సప్లై సామర్థ్యం పెరుగుతుందని చెప్పారు. నగరంలో జలమండలి పరిధి, సేవల విస్తృతిని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. జలమండలి పరిధిలో మొత్తం నల్లా కనెక్షన్లు దాదాపు 14 లక్షల 50 వేల వరకున్నాయని, వీటిలో దాదాపు 6 లక్షల 23 వేల కనెక్షన్లకు ఉచిత నీటి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. సీవరేజ్ నెట్ వర్క్ 14 వేల కిలోమీటర్ల పొడువు ఉండగా, మ్యాన్ హోల్స్ దాదాపు 6 లక్షల 14 వేల వరకున్నాయని, ట్రంక్ సీవర్ లైన్ దాదాపుగా 660 కిలోమీటర్ల పొడువున్నట్లు మంత్రి వెల్లడించారు. పెరిగిన జలమండలి విస్తీరణ కోసం అదనంగా సిబ్బందిని టీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్లు ఆయన వివరించారు. ముఖ్యంగా కోర్ అర్బన్ రీజియన్ లోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని 300 మున్సిపల్ వార్డుల్లో వార్డుకు ఒకరు చొప్పున మొత్తం 300 మంది మేనేజర్లను నియమించి, వాటర్ సప్లై నుంచి మెరుగుపర్చనున్నట్లు ఆయన వెల్లడించారు.
Also read: మనుషులని మాయం చేసే బ్లాక్ మ్యాజిక్… కల్లోనూ వెంటాడే హర్రర్ సీన్లున్న మూవీ